పండుగల వేళలో సొంత ఊర్లకు వెళ్లేవారు ప్రయాణంలో సౌకర్యం ఉండాలని కోరుకుంటారు. ఎంతో డబ్బుఖర్చు పెట్టినా ప్రయాణంలో ఇబ్బంది ఉంటే ఆనందం కాస్త ఆవిరి అవుతుంది. మన ఇబ్బందులని గమనించిన భారతీయ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. రద్దీగా ఉండే మార్గాల్లో నడుస్తున్న ఎక్స్ ప్రెస్, సూపర్ ఫాస్ట్ రైళ్లకు అదనపు బోగీలు (జనరల్) ఏర్పాటు చేస్తోంది. విడతలవారీగా బోగీలు అందుబాటులో ఉండేవాటిని బట్టి నిర్ణయాలు తీసుకుంటోంది. ఇప్పటికే 31 రైళ్లకు అదనంగా జనరల్ బోగీల సంఖ్య పెంచింది. ప్రతి రైలుకు రెండు బోగీలు ఏర్పాటు చేశారు. తాజాగా మరో తొమ్మిది రైళ్లకు అదనపు బోగీలు యాడ్ అయ్యాయి. ఇకనుంచి ప్రతి రైలులో జనరల్ బోగీల సంఖ్య నాలుగుకు చేరుతోంది. గతంలో ఇంజన్ తర్వాత ఒకటి, చివర్లో గార్డ్ బోగీకి ముందు ఒకటి ఉండేది. ఇప్పుడు ఇంజన్ తర్వాత రెండు జనరల్ బోగీలు, చివర్లో రెండు బోగీలు ఉంటున్నాయి.
పెరిగిన జనరల్ బోగీల సంఖ్య
ఒక స్లీపర్ బోగీని తగ్గించి.. గతంలో ప్రతి రైలుకు నాలుగు జనరల్ బోగీలు ఉండేవి. అయితే ఆదాయంపై దృష్టిపెట్టిన రైల్వే సామాన్య ప్రయాణికులను మాత్రం గాలికి వదిలేసింది. స్లీపర్ బోగీలు పెంచింది. కాలక్రమంలో వాటిని కూడా తగ్గించి ఏసీ బోగీల సంఖ్య పెంచింది. దూర ప్రాంతాలకు ప్రయాణించే రైళ్లల్లో జనరల్ బోగీల్లో ప్రయాణించాలంటే నరకం అని చెప్పొచ్చు. తీవ్రస్థాయిలో విమర్శల జడివాన కురవడంతో ఎట్టకేలకు అధికారులు దిగివచ్చి దూర ప్రాంతాలకు ప్రయాణించే రైళ్లల్లో, రద్దీమార్గాల్లో తిరిగే రైళ్లల్లో జనరల్ బోగీల సంఖ్యను పెంచుతున్నారు. దీనికి బదులుగా ఒక స్లీపర్ బోగీని తగ్గిస్తున్నారు.