బీజీంగ్: టిబెట్ బౌద్ధగురువు దలైలామా కీలక వ్యాఖ్యలు చేశారు. చైనా బయటే తన వారసుడు జన్మిస్తాడని ఆయన పేర్కొన్నారు. దలైలామా కొత్తగా రాసిన పుస్తకంలో ఈ విషయాన్ని వెల్లడించారు. దీంతో దాదాపు ఆరు దశాబ్దాలుగా టిబెట్ నియంత్రణపై చైనాతో ఆయనకు వివాదం ఉన్న విషయం తెలిసిందే. తన తర్వాత దలైలామా వారసత్వం కొనసాగాలని ఆయన రాసిన వాయిస్ ఫర్ ది వాయిస్లెస్లో కోరారు. నేడు విడుదల కానున్న ఈ పుస్తకాన్ని ఓ ఆంగ్ల వార్తా సంస్థ సమీక్షించింది.

గతంలో ఓ సందర్భంలో దలైలామా మాట్లాడుతూ తన తర్వాత ఈ పరంపర ముగిసిపోవచ్చని ఆందోళన వ్యక్తం చేశారు. కానీ, తాజా పుస్తకంలో మాత్రం చైనా బయట పుడతారని పేర్కొన్నారు. తన పునర్జన్మ టిబెట్ బయట జరగొచ్చని.. అది భారత్లో కూడా కావచ్చని ఆయన పేర్కొన్నారు. పూర్వీకుల పనిని ముందుకు తీసుకెళ్లటానికి ఉద్దేశించిందే పునర్జన్మ. కొత్త దలైలామా చైనా బయట స్వేచ్ఛా ప్రపంచంలో జన్మిస్తాడు. అందుకే తన బాధ్యత అయిన విశ్వకరుణకు గొంతుకగా ఉంటారు అని పేర్కొన్నారు.

14వ దలైలామాగా మారిన టెంజియన్ గ్యాట్సో 23వ ఏటే టిబెట్ నుంచి భారత్కు వలసవచ్చారు. నాడు తమ ప్రాంతాన్ని ఆక్రమించిన చైనాకు వ్యతిరేకంగా ఆయన గళం విప్పారు. టిబెట్ వాదాన్ని సజీవంగా ఉంచినందుకు ఆయనకు 1989లో నోబెల్ శాంతి బహుమతి వచ్చింది. తన వారసుడిగా చైనా ప్రకటించే వ్యక్తికి ఎటువంటి గౌరవం లభించదని వెల్లడించారు.
దలైలామా ప్రస్తుతం భారత్లోని ధర్మశాలలో ఆశ్రయం పొందుతున్నారు. ఆయన అక్కడి నుంచే తన వారసుడిని ఎంపిక చేయనున్నారు. ఇది చైనాకు గిట్టక తన గడ్డపైనే వారసుడిని గుర్తించాలంటోంది. టిబెటన్ బౌద్ధుల దృష్టిలో దలైలామా తరవాత రెండో స్థానం పాంచెన్ లామాది. ఈ పదవికి దలైలామా ఎంపిక చేసిన బాలుడిని కాదని చైనా తనే ఒక బాలుడిని నియమించినా, టిబెటన్ల ఆమోదం పొందడంలో అతడు విఫలమయ్యాడు. ఈ నేపథ్యంలో ఇప్పుడు కొత్త వారసుడి ఎంపికపై ఆసక్తి నెలకొంది.