ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పాకిస్థాన్ జాతీయులు తక్షణమే దేశాన్ని విడిచి తమ స్వదేశానికి వెళ్లిపోవాలని డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా కఠినంగా హెచ్చరించారు. రేపటి తర్వాత ఏపీలో ఎవైనా పాకిస్థాన్ పౌరులు అనుమతి లేకుండా ఉన్నట్లయితే, వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్టు తెలిపారు.

కేంద్ర హోంశాఖ కీలక ఆదేశాలు
ఈ చర్యలు కేంద్ర హోంశాఖ ఆదేశాల మేరకు తీసుకుంటున్నట్టు సమాచారం. దేశ భద్రతను దృష్టిలో ఉంచుకొని విదేశీయుల సమాచారం, క్రమబద్ధతపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఇటువంటి పరిస్థితుల్లో పాకిస్థాన్ పౌరులు దేశంలో ఎక్కడైనా అక్రమంగా ఉన్నట్లయితే, వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని పోలీసులు చెబుతున్నారు.
పాకిస్థాన్ పౌరులు వెంటనే వెళ్లిపోవాలని హెచ్చరిక
ఇకపోతే, తెలంగాణ రాష్ట్ర డీజీపీ జితేందర్ కూడా ఇటువంటి ప్రకటన ఇటీవలే చేశారు. ఆయన కూడా రాష్ట్రంలోని పాకిస్థాన్ పౌరులు వెంటనే వెళ్లిపోవాలని ఆదేశించారు. రెండు రాష్ట్రాల్లో తీసుకుంటున్న ఈ చర్యలు, అంతర్గత భద్రతను మరింత బలపరిచేందుకు ప్రభుత్వం తీసుకున్న ముందు జాగ్రత్త చర్యలుగా విశ్లేషించబడుతున్నాయి.