అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మహిళా శక్తికి తన మద్దతును ప్రకటించారు. ఆయన తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలను మహిళా విజేతలకే అప్పగిస్తానని ప్రకటించడం గమనార్హం. ఈ ప్రకటన నిన్న సూరత్లో నిర్వహించిన ఆహార భద్రత ప్రారంభోత్సవ కార్యక్రమంలో వెల్లడించారు. మోదీ తన పాలనలో ఎప్పుడూ మహిళా సాధికారతకు ప్రాధాన్యత ఇస్తూ వస్తున్నారు. ప్రధాని మోదీ నేతృత్వంలో దేశంలో మహిళా సాధికారతపై అనేక చర్యలు తీసుకున్నారు. ‘బేటీ బచావో, బేటీ పడావో’, ‘ఉజ్వల యోజన’, ‘ముద్రా లోన్’ వంటి పథకాలు మహిళల అభివృద్ధికి దోహదపడుతున్నాయి. సోషల్ మీడియాలోనూ మహిళల పాత్రను మెరుగుపరచాలనే ఉద్దేశంతో మోదీ తన ఖాతాలను మహిళా విజేతలకు అప్పగించేందుకు నిర్ణయం తీసుకున్నారు.

మోదీ సోషల్ మీడియా ఖాతాల ప్రాధాన్యత
ప్రపంచంలోనే అత్యధిక సోషల్ మీడియా ఫాలోవర్స్ ఉన్న రాజకీయ నాయకులలో నరేంద్ర మోదీ ఒకరు. ఎక్స్ (ట్విట్టర్), ఫేస్బుక్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్ వంటి వేదికల్లో కోట్లాదిమంది ఆయనను అనుసరిస్తున్నారు. ఈ ఖాతాలను మహిళలకు అప్పగించడం ద్వారా వారి గొప్ప కృషిని ప్రపంచానికి తెలియజేయడం, యువతకు ప్రేరణ కలిగించడమే లక్ష్యంగా ఉంది. ఈ కార్యక్రమం కొత్తదేమీ కాదు. 2020 మార్చి 8న జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధాని మోదీ తన ట్విట్టర్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, టెలిగ్రామ్ తదితర ఖాతాలను ఏడుగురు మహిళలకు అప్పగించారు. వీరిలో ఏపీకి చెందిన కల్పన రమేశ్, మహారాష్ట్రకు చెందిన కళావతిదేవి, తమిళనాడుకు చెందిన వీణాదేవి, కశ్మీర్కు చెందిన అరిఫా జాన్, కేరళకు చెందిన డాక్టర్ మాళవిక, ఉత్తరప్రదేశ్కు చెందిన విజయ పవార్, స్నేహ మోహన్ దాస్ ఉన్నారు. వీరు తమ జీవిత ప్రయాణం, సామాజిక సేవ గురించి ప్రపంచానికి తెలియజేసేందుకు ఈ అవకాశాన్ని ఉపయోగించుకున్నారు.
వివిధ రంగాల్లో సక్సెస్ సాధించిన మహిళలు తమ అనుభవాలను పంచుకుని, సమాజంపై తాము చూపించిన ప్రభావాన్ని తెలియజేసే అవకాశాన్ని మోదీ కల్పిస్తున్నారు. ఇది వారి గౌరవాన్ని పెంచడమే కాకుండా, ఇతర మహిళలకు స్ఫూర్తిదాయకంగా మారేలా చేస్తోంది. మహిళలు నేడు ఉద్యోగ రంగం, వ్యాపార రంగం, సైన్యం, సాంకేతికత, వైద్యరంగం వంటి అనేక విభాగాల్లో అద్భుత విజయాలను సాధిస్తున్నారు. మోదీ ఈ కార్యక్రమం ద్వారా మహిళా శక్తిని మరింతగా ప్రోత్సహించేందుకు నడుం బిగించారు. భారత ప్రభుత్వం మహిళల భద్రత, అభివృద్ధి కోసం అనేక పథకాలు అమలు చేస్తోంది. లింగ సమానత్వాన్ని పెంపొందించేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తోంది. మహిళలు తమ కలలను నిజం చేసుకునేందుకు, అన్ని రంగాల్లో ముందుకు సాగేందుకు ఈ తరహా కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయి. ప్రధాని మోదీ తీసుకున్న ఈ నిర్ణయం సామాజిక మాధ్యమాల్లో మహిళా శక్తిని మరింతగా గుర్తించేందుకు దోహదపడుతోంది. ప్రతి ఏడాది మహిళా దినోత్సవం నాడు ఈ తరహా అవకాశాలను కల్పించడం ద్వారా మహిళలకు గౌరవం, ప్రాముఖ్యత పెరుగుతుందనడంలో సందేహం లేదు. మహిళలు అన్ని రంగాల్లో సాధించిన విజయాలను వెలుగులోకి తేవడం ద్వారా, నూతనతరం మహిళలకు మార్గదర్శకత్వాన్ని అందించేందుకు మోదీ ఈ కార్యక్రమాన్ని ఉపయోగిస్తున్నారు.