అమరావతి: నేడు ఒంగోలు పోలీస్ స్టేషన్ కు డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ వెళ్లనున్నారు. సోషల్ మీడియాలో సీఎం చంద్రబాబు నాయుడు , డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ , మంత్రి నారా లోకేశ్ మార్ఫింగ్ ఫొటోలు పెట్టారని ఆయనపై అభియోగాలు ఉన్న నేపథ్యంలో విచారణకు రావాలని పోలీసులు ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. అయితే గత విచారణకు వెళ్లలేదు. ఫిబ్రవరి 7 వరకూ సమయం కావాలని కోరారు. దీంతో సమయం ఇచ్చారు. దీంతో ఒంగోలుకు ఆర్జీవీ వెళ్తున్నట్లు తెలుస్తోంది. కానీ ఆర్జీవీ టీమ్ నుంచి ఎలాంటి సమాచారం లేదు.

కాగా, గత సార్వత్రిక ఎన్నికలకు ముందు సినీ దర్శకుడు రామ్గోపాల్ వర్మ వైసీపీకి అనుకూలంగా వ్యూహం చిత్రాన్ని రూపొందించారు. ప్రచార సమయంలో అప్పటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత సీఎం చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు, ప్రస్తుత డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ వ్యక్తిత్వాలను కించపరిచేలా ట్విట్టర్(ప్రస్తుతం ఎక్స్)లో పోస్టులు పెట్టారు. వీటిపై మద్దిపాడు మండల టీడీపీ ప్రధాన కార్యదర్శి ఎం.రామలింగం ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు విచారణకు సంబంధించి ఒంగోలు గ్రామీణ పోలీసుల ఎదుట వర్మ శుక్రవారం హాజరుకావాల్సి ఉంది.
కేసు విచారణకు హాజరుకావాలని హైదరాబాద్లోని రామ్గోపాల్వర్మ నివాసానికి జిల్లా పోలీసులు వెళ్లి గతంలోనే నోటీసులు జారీ చేశారు. వాటిని అందుకున్న వర్మ.. ఆ తర్వాత తాను సినిమా చిత్రీకరణలో నిమగ్నమై ఉన్నాననీ, వేరొక రోజు వస్తానని వాట్సప్ ద్వారా సందేశం పంపారు. పోలీసుల అనుమతి లేకుండానే విచారణకు గైర్హాజరయ్యారు. దీంతో ఆయన్ను అరెస్టు చేసేందుకు పోలీసులు రంగంలోకి దిగగా.. కొన్నాళ్లపాటు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. అదే సమయంలో తనపై పోలీసులు అన్యాయంగా, అక్రమంగా కేసు నమోదు చేశారని, సదరు ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలంటూ న్యాయస్థానంలో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు.