విశాఖపట్నంలో జరిగిన హరిహర వీరమల్లు (Hariharaviramallu) ప్రీ రిలీజ్ ఈవెంట్లో పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. చరిత్రలో నిజాలు భవిష్యత్ తరాలకు తెలియజేయాలన్న సంకల్పంతో ఈ సినిమాను ప్రారంభించామని తెలిపారు. కోహినూర్ వజ్రాన్ని మొఘలుల నుండి తిరిగి తెచ్చేందుకు యత్నించే కల్పిత యోధుడి కథగా ఈ చిత్రం సాగుతుందని వివరించారు. ధర్మం దారి తప్పిన ప్రతిసారి దాన్ని రక్షించే శక్తిగా ఈ చిత్రం నిలుస్తుందని అన్నారు.
విశాఖతో ఉన్న అనుబంధం, సినీ ప్రయాణం మొదలైన వేళలు
విశాఖపట్నంతో తనకు ఉన్న అనుబంధాన్ని పవన్ (Pawan Kalyan) గుర్తు చేశారు. నటనలోకి అడుగుపెట్టిన తొలి రోజుల్లో విశాఖలో సత్యానంద్ వద్ద శిక్షణ తీసుకున్నానని, ఆయన దగ్గర నటన కంటే ధైర్యం నేర్చుకున్నానన్నారు. గతంలో విశాఖలో జరిగిన జనవాణి ఘటనను గుర్తు చేస్తూ, ప్రజలు తన కోసం నోవోటెల్ హోటల్ ఎదుట చేరిన సంఘటన తనకు చిరస్మరణీయమని చెప్పారు. అదే కారణంగా ఈ ఫంక్షన్ను విశాఖలో నిర్వహించామని వివరించారు.
సినిమా, ధర్మం, రాజకీయాలపై స్పష్టమైన సందేశం
హరిహర వీరమల్లు సినిమాలో మాటలకంటే యాక్షన్ ఎక్కువగా ఉంటుందని పవన్ తెలిపారు. ధర్మాన్ని అణచే పాలకులపై నిలదీయడమే ఈ కథ ప్రధాన ఉద్దేశమని వివరించారు. సనాతన ధర్మం అనేది ఏ మతానికీ వ్యతిరేకం కాదని, హిందువుగా ఉండేందుకు జిజియా పన్ను చెల్లించాల్సిన దుస్థితిని చూపించేందుకే ఈ కథ రూపొందించామన్నారు. చరిత్ర పాఠాల్లో మొఘలుల గురించి ఎక్కువగా, దక్షిణ భారత రాజుల గురించి తక్కువగా చెప్పడం ఆవేదన కలిగిస్తుందని వ్యాఖ్యానించారు. అభిమానుల కోసం మరోసారి ఓ విజయవంతమైన హిట్ ఇవ్వాలన్నదే తన మనసులో కోరిక అని పేర్కొన్నారు.
Read Also : Nara Lokesh : లోకేష్ చొరవ తో వైజాగ్ కు పెట్టుబడుల వెల్లువ!