అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతీకార సుంకాలతో అంతర్జాతీయంగా తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. అమెరికన్లు సైతం ట్రంప్ తీరుపై మండిపడుతున్నారు. ఆయనకు వ్యతిరేకంగా అమెరికన్లు వీధుల్లోకి వచ్చి భారీ నిరసనలు, ఆందోళనలు చేపడుతున్నారు. అయినాసరే తాను మాత్రం వెనక్కి తగ్గేదిలేదని అమెరికా అధ్యక్షుడు తెగేసి చెప్పేశారు. ఈ క్రమంలో పలు దేశాలు దిగొచ్చాయని ట్రంప్ సలహాదారులు చెబుతున్నారు. 50కిపైగా దేశాలు వాణిజ్య చర్చలకు ప్రతిపాదనలు తీసుకొచ్చాయని అమెరికా జాతీయ ఆర్ధిక కౌన్సిల్ డైరెక్టర్ కెవిన్ హసెట్ వెల్లడించారు. ఈ దేశాలు నేరుగా వైట్ హౌస్ను సంప్రదించాయని ఆయన తెలిపారు.

చర్చల కోసం ముందుకొస్తున్నాయి
‘‘వాస్తవం ఏంటంటే కొన్ని దేశాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.. కానీ అదేసమయంలో చర్చల కోసం ముందుకొస్తున్నాయి కూడా. నిన్న రాత్రి నాకు అమెరికా వాణిజ్య ప్రతినిధి వద్ద నుంచి వచ్చిన నివేదిక ప్రకారం 50కి పైగా దేశాలు అధ్యక్షుడిని సంప్రదించి చర్చలు ప్రారంభించాలనుకుంటున్నాయి. అవి ఎందుకు ఇలా చేస్తున్నాయంటే, ఈ సుంకాల భారం ఎక్కువ భాగాన్ని తామే భరిస్తున్నారన్న విషయాన్ని అవగాహన చేసుకున్నందువల్లే. కాబట్టి అమెరికాలోని వినియోగదారులపై పెద్దగా ప్రభావం ఉండదని నాకు అనిపిస్తోంది.. దీర్ఘకాలికంగా మనకు వాణిజ్య లోటు ఉండటానికి కారణం ఈ దేశాల సరఫరా ఎంతో స్థిరంగా ఉండటమే. ఇవాళ చైనా లాంటి దేశాలు ఉద్యోగాలు సృష్టించాలనే ఉద్దేశంతో తమ ఉత్పత్తులను అమెరికాకు తరలిస్తున్నాయి’’ అని అన్నారు.
ప్రపంచ వాణిజ్యంలో అమెరికా టాప్
ఆదివారం ఉదయం ఓ టాక్ షోలో ఆయన మాట్లాడుతూ.. ట్రంప్ సుంకాలను సమర్థించారు. వాటిని ప్రపంచ వాణిజ్యంలో అమెరికా స్థానాన్ని బలోపేతం చేయడానికి ఒక వ్యూహాత్మక చర్యగా ఆయన అభివర్ణించారు. మరోవైపు, అమెరికాతో పలు దేశాలు చర్చలు ప్రారంభించాయని ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెస్సెంట్ వెల్లడించారు, అయితే, ఇందులో ఆ దేశాల వివరాలను ఆయన వెల్లడించలేదు. సుంకాలు ట్రంప్ ‘పరపతి’ని పెంచాయని బెస్సెంట్ పేర్కొన్నప్పటికీ.. అమెరికా ఆర్థిక వ్యవస్థపై వాటి ప్రభావం అనిశ్చితంగా ఉంది. అమెరికాలో ఊహించని విధంగా బలమైన ఉద్యోగ వృద్ధిని ఉటంకిస్తూ ఆయన మాంద్యం గురించి ఆందోళనలను తోసిపుచ్చారు.
ప్రపంచ వాణిజ్య యుద్ధ భయాలను కలిగిస్తున్నది
ఇదిలా ఉండగా, ట్రంప్ సుంకాల ప్రకటనతో అమెరికా మార్కెట్లు కుదేలవుతున్నాయి. గతవారం ఏకంగా 6 ట్రిలియన్ డాలర్లు ముదుపర్ల సంపద ఆవిరయ్యింది. ప్రపంచ మార్కెట్లను ఈ సుంకాలు దెబ్బతీశాయి. ఆర్థిక మాంద్యం భయాలను రేకెత్తించాయి. అయితే ట్రంప్ యంత్రాంగం వినాశకరమైన ఆర్థిక పరిణామాలను లైట్ తీసుకుంటోంది. ఇతర దేశాలు స్పందించడంతో మరో వారం అస్థిరత ఇలాగే ఉంటుందని భావిస్తున్నారు. అమెరికా ఓడరేవులు, విమానాశ్రయాలు, కస్టమ్స్ గిడ్డంగులలో అమల్లోకి వచ్చింది. రెండో ప్రపంచ యుద్ధం ప్రపంచ ఆర్ధిక వ్యవస్థను సుంకాలు ఇంతలా ప్రభావితం చేయడం ఇదే మొదటిసారి. మరోవైపు, ఈ సుంకాలు అమెరికా స్థూల దేశీయోత్పత్తి (GDP) క్షీణతకు దారితీస్తాయని ఆర్థికవేత్తలు హెచ్చరిస్తున్నారు. అంతేకాదు, ఇది ప్రపంచ వాణిజ్య యుద్ధ భయాలను పెంచుతోంది.