ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికా పర్యటన విజయవంతంగా ముగిసింది. రెండు రోజుల పాటు (ఫిబ్రవరి 12, 13) జరిగిన ఈ పర్యటన అనంతరం మోదీ స్వదేశానికి తిరుగు ప్రయాణమయ్యారు. ఈ పర్యటనలో ఆయన పలు కీలక నేతలతో సమావేశమయ్యారు. ముఖ్యంగా, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో పాటు ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ప్రముఖ రాజకీయ నాయకురాలు తులసీ గబ్బార్డ్, టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్, భారతీయ అమెరికన్ వ్యాపారవేత్త వివేక్ రామస్వామి తదితరులతో భేటీ అయ్యారు.భారత్-అమెరికా సంబంధాల బలోపేతం, పెట్టుబడులు, వాణిజ్య సహకారం, నూతన వృత్తిపరమైన అవకాశాలు, మౌలిక వసతుల అభివృద్ధి, గ్లోబల్ టెక్నాలజీ రంగంలో భాగస్వామ్యం వంటి అంశాలపై చర్చలు జరిగాయి. ప్రధానంగా, మోదీ-ట్రంప్ భేటీ ద్వైపాక్షిక సంబంధాల పరంగా గణనీయమైన ప్రాధాన్యతను సంతరించుకుంది. భద్రతా రంగ సహకారం, వ్యూహాత్మక మైత్రి, ఆర్థిక వ్యాపార ఒప్పందాలపై వారు విస్తృతంగా చర్చించారు.మరోవైపు అమెరికా జాతీయ భద్రతా సలహాదారు (ఎన్ఎస్ఏ) మైఖేల్ వాల్జ్ తోనూ ప్రధాని మోదీ సమావేశం అయ్యారు. భారత్-అమెరికా సంబంధాల్లో రక్షణ, సాంకేతికత, భద్రతా రంగాలు చాలా కీలకమని అభిప్రాయపడ్డారు. కృత్రిమ మేధ (ఏఐ), సెమీకండక్టర్లు, అంతరిక్షం తదితర రంగాల్లో ఇరు దేశాలూ పరస్పర సహకారం పెంచుకునేందుకు అవకాశాలు ఉన్నాయని ప్రధాని మోదీ ఈ భేటీలో పేర్కొన్నారు.

అమెరికాలో అక్రమంగా నివసిస్తోన్న భారత వలసదారుల గురించి విలేకరులు అడిగిన ప్రశ్నలకు ప్రధాని మోదీ సమాధానం ఇచ్చారు. అక్రమంగా, అనధికారికంగా ఎవరు కూడా ఏ దేశంలోనూ నివసించలేరని, వారికి ఆ అర్హత సైతం లేదని చెప్పారు. అలాంటి వారిని ఏ దేశం కూడా భరించదనీ స్పష్టం చేశారు. ఇది తమ విషయంలోనూ వర్తిస్తుందని అన్నారు. అమెరికాలో నివసించే తమ దేశ అక్రమ వలసదారులను వెనక్కి పిలిపించుకుంటామని మోదీ తేల్చి చెప్పారు. ఈ విషయాన్ని తాము ముందు నుంచీ చెబుతూనే వస్తోన్నామని పేర్కొన్నారు. వెరిఫికేషన్ తరువాత నిజమైన భారత పౌరుడిని తాము స్వదేశానికి వెనక్కి పిలిపించుకుంటామని అన్నారు. అక్రమ వలసదారుల్లో చాలామంది ఆర్డినరీ ఫ్యామిలీ కు చెందిన వాళ్లని వ్యాఖ్యానించారు మోదీ. వారికి మాయమాటలు చెప్పి అమెరికాకు తరలించివుండొచ్చని పేర్కొన్నారు. మానవ అక్రమ రవాణా వ్యవస్థ మొత్తాన్నీ తుడిచేయాల్సిన అవసరం ఉందని మోదీ ఘాటుగా చెప్పారు. ఈ విషయంలో అమెరికాకు పూర్తి సహకారాన్ని అందిస్తామని అన్నారు.
మోదీ ఫ్రాన్స్ పర్యటన హైలైట్స్
ఫిబ్రవరి 10, 11 తేదీల్లో ప్రధాని నరేంద్ర మోదీ ఫ్రాన్స్లో పర్యటించారు. ఇరుదేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు ఈ పర్యటన దోహదపడింది. రక్షణ, వాణిజ్యం, విద్య, పునరుత్పాదక ఇంధన రంగాల్లో సహకారం పెంపొందించే అంశాలపై చర్చలు జరిగాయి.
వాణిజ్య ఒప్పందాలపై కీలక ప్రకటన
అత్యాధునిక రక్షణ వ్యవస్థలు, మిలిటరీ ఉత్పత్తుల విక్రయాల పెంపు, ఇంధన సరఫరా వంటి అంశాలపై అమెరికా–భారత్ మధ్య కీలక ఒప్పందాలు కుదిరే అవకాశమున్నట్లు ట్రంప్ వెల్లడించారు. త్వరలో పెద్ద ఎత్తున వాణిజ్య ఒప్పందాలు ప్రకటించనున్నట్లు పేర్కొన్నారు.
ఎఫ్-31 యుద్ధ విమానాల విక్రయంపై అమెరికా సిద్ధం
భారత వైమానిక దళానికి అధునాతన ఎఫ్-31 యుద్ధ విమానాలను విక్రయించేందుకు అమెరికా సిద్ధంగా ఉందని ట్రంప్ ప్రకటించారు. భారత్ రక్షణ సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ ఒప్పందం కుదురుతుందని వెల్లడించారు.
ఇంధన, మిలిటరీ సరఫరా పెంపు
భారత్కు చమురు, గ్యాస్ సరఫరా మరింత పెంచేందుకు అమెరికా సానుకూలంగా ఉందని ట్రంప్ తెలిపారు. రక్షణ రంగంలో మిలిటరీ ఉత్పత్తుల సరఫరా పెంచేందుకు అమెరికా సిద్ధంగా ఉందని ప్రకటించారు. 2025 నాటికి ఇరుదేశాల మధ్య వాణిజ్య విలువ మరింత పెరుగుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.