హిందూపురం మళ్లీ రాజకీయ వేడి అందుకుంది.అక్కడ పర్యటించిన ఎమ్మెల్యే బాలకృష్ణ, వైసీపీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.ఇది రాయలసీమ గడ్డ.ఇక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల జోలికి వస్తే ఊరుకోము,” అంటూ గట్టిగానే హెచ్చరించారు.ఈరోజు బాలకృష్ణ హిందూపురం నియోజకవర్గంలో పర్యటించారు.పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇందిరమ్మ కాలనీలో పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ, “తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ ప్రజలతో ఉందంటూ” అన్నారు. మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్కు హిందూపురం అంటే ప్రత్యేక ప్రేమ అని గుర్తు చేశారు.కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం కూడా పూర్తికాకముందే అభివృద్ధి తారాస్థాయికి చేరిందన్నారు. హిందూపురంలో రూ.50 కోట్లతో పలు అభివృద్ధి పనులు చేపట్టినట్లు చెప్పారు.తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం రూ.136 కోట్ల ప్రాజెక్ట్ సిద్ధమైందన్నారు.

త్వరలో మున్సిపాలిటీలో ఆధునిక డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.1984లోనే ఎన్టీఆర్ తూముకుంట వద్ద పారిశ్రామిక వాడను స్థాపించారని అన్నారు. ఆ దృష్టికోణం ఇప్పటికీ ప్రజలకు గుర్తుండిపోతుందని చెప్పారు. అభివృద్ధి కార్యక్రమాలే తమ ప్రభుత్వ లక్ష్యమని బాలకృష్ణ స్పష్టం చేశారు.వైసీపీ నేతలకు బాలకృష్ణ కాస్త ఘాటు మాటలే సంధించారు. “అభివృద్ధిలో భాగస్వాములవ్వండి.విమర్శలు మానండి,” అంటూ హితవు పలికారు. “సీమను, సీమ నాయకులను చిన్నచూపు చూస్తే సహించము,” అని హెచ్చరించారు.తెలుగుదేశం పార్టీ ప్రజలకు జవాబుదారీగా పనిచేస్తుందని బాలకృష్ణ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు దార్శనిక నాయకుడని ప్రశంసించారు. ప్రజల సంక్షేమమే తమ లక్ష్యమన్నారు.హిందూపురం రాజకీయంగా మరింత ఉత్కంఠకరంగా మారింది. బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు, అభివృద్ధి ప్రణాళికలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. వచ్చే ఎన్నికల దృష్ట్యా ఇవే కీలకం అవుతాయని అనిపిస్తోంది.
Read Also : Andhrapradesh: ఈ నెలలోనే ఏపీలో అన్నదాత సుఖీభవ పథకం అమలు