మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా గుజరాత్లోని నవ్సరి జిల్లాలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఓ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో మహిళా పోలీసు సిబ్బందితో కూడిన భద్రతా బృందాన్ని మోహరిస్తామని ఈ రాష్ట్ర మంత్రి తెలిపారు. “అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు గుజరాత్ పోలీసులు ఒక ప్రత్యేకమైన చొరవ తీసుకుంటున్నారు. భారతదేశ చరిత్రలో తొలిసారిగా, నవ్సరిలోని వాన్సీ బోర్సీ గ్రామంలోని హెలిప్యాడ్ వద్దకు ప్రధాని రాక నుంచి కార్యక్రమ వేదిక వరకు మొత్తం భద్రతా ఏర్పాట్లను మహిళా పోలీసులు మాత్రమే నిర్వహిస్తారు” అని హోం శాఖ సహాయ మంత్రి హర్ష్ సంఘవి గురువారం తెలిపారు. మహిళా పోలీసు సిబ్బందిలో ఐపీఎస్ అధికారులు, కానిస్టేబుళ్లు ఉంటారని పేర్కొన్నారు.

కేవలం మహిళా భద్రతా సిబ్బంది తోనే సెక్యూరిటీ
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఏ కార్యక్రమంలో పాల్గొన్నా భారీ ఎత్తున భద్రతా ఏర్పాటు చేస్తారు. ప్రధానిగా ఆయనకు ఉండే హై సెక్యూరిటీ కాకుండా మూడు నాలుగు అంచెల్లో భద్రతా వలయాలు ఏర్పాటు చేస్తారు. మోదీని చూసేందుకు, ఆయన సభకు హాజరయ్యేందుకు చాలా మంది జనం, ఆయన అభిమానులు, బీజేపీ కార్యకర్తలు వస్తారు కాబట్టి వారిని అదుపు చేయడానికి పోలీస్ సిబ్బందిని బందోబస్తుగా పెడతారు. అయితే అందులో ఎక్కువ పురుష భద్రతా సిబ్బంది ఉంటారు. కానీ, ఫర్ ది ఫస్ట్ టైమ్ ఓ భారీ కార్యక్రమంలో కేవలం మహిళా భద్రతా సిబ్బంది తోనే సెక్యూరిటీని కల్పిస్తున్నారు. అలా చేయడానికి ఒక ప్రత్యేక కారణం ఉంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
‘లఖ్ప్తి దీదీ సమ్మేళన్’ సభ
ప్రధాని మోదీ శుక్ర, శనివారాల్లో గుజరాత్, కేంద్ర పాలిత ప్రాంతం దాద్రా, నాగర్ హవేలీలలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా మార్చి 8న వంసి బోర్సి గ్రామంలో జరిగే ‘లఖ్ప్తి దీదీ సమ్మేళన్’లో పాల్గొని ప్రసంగిస్తారు. “2,100 మందికి పైగా కానిస్టేబుళ్లు, 187 మంది సబ్-ఇన్స్పెక్టర్లు, 61 మంది పోలీస్ ఇన్స్పెక్టర్లు, 16 మంది డిప్యూటీ సూపరింటెండెంట్లు, ఐదుగురు ఎస్పీలు, ఒక ఐజీ, ఒక అదనపు డీజీపీ ర్యాంక్ అధికారితో సహా అంతా మహిళా పోలీసు సిబ్బంది ఆ రోజు భద్రతను నిర్వహిస్తారు” అని మంత్రి పేర్కొన్నారు. సీనియర్ మహిళా ఐపీఎస్ అధికారిణి, హోం కార్యదర్శి భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తారని మంత్రి తెలిపారు.