ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనుల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరై, వర్చువల్గా శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా తెలుగులో ప్రసంగం ప్రారంభించిన మోదీ, దుర్గమ్మ తల్లి కొలువై ఉన్న పుణ్యభూమిలో ప్రజలను కలవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, గవర్నర్ అబ్దుల్ నజీర్కి అభినందనలు తెలిపారు. శంకుస్థాపన చేసిన రూ.60 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులు కేవలం నిర్మాణాలు కాదని, అవి ఏపీ అభివృద్ధికి పునాదులని తెలిపారు.
ఐటీ, గ్రీన్ ఎనర్జీ, పరిశ్రమలు, వైద్యం, విద్య వంటి రంగాల్లో అమరావతి ప్రత్యేక గుర్తింపు
అమరావతి ఒక నగరం కాదు, అది ఒక శక్తి అని ప్రధాని వ్యాఖ్యానించారు. ఈ రాజధానిని ఆధునికతకు ప్రతీకగా తీర్చిదిద్దేందుకు కేంద్రం అన్ని విధాలుగా మద్దతు ఇస్తుందని హామీ ఇచ్చారు. ఐటీ, గ్రీన్ ఎనర్జీ, పరిశ్రమలు, వైద్యం, విద్య వంటి రంగాల్లో అమరావతి ప్రత్యేక గుర్తింపు పొందనుందని తెలిపారు. చంద్రబాబు నాయుడిని ప్రశంసించిన మోదీ, గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో హైదరాబాదు ఐటీ అభివృద్ధిని అధ్యయనం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. పెద్ద ప్రాజెక్టుల అమలులో చంద్రబాబు అనుభవాన్ని కొనియాడారు.
నాయుడుపేట–రేణిగుంట హైవే ప్రాజెక్టు
వికసిత భారత్ లక్ష్యంలో ఏపీ ముఖ్యపాత్ర పోషించాలని ప్రధాని తెలిపారు. ఎన్టీఆర్ కలల అమలే తమ లక్ష్యమని, చంద్రబాబు, పవన్ కల్యాణ్ నేతృత్వంలో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్లాలని పేర్కొన్నారు. నాయుడుపేట–రేణిగుంట హైవే ప్రాజెక్టుతో పాటు రాష్ట్రంలో రైలు, రోడ్డు కనెక్టివిటీ మెరుగుపరచేందుకు కేంద్రం వేల కోట్ల రూపాయలతో సహకరిస్తోందని వివరించారు. అమరావతి పునర్నిర్మాణం ద్వారా రాష్ట్రం నవ్యాంధ్ర రూపంలో వికసిస్తుందని ప్రధాని ఆశాభావం వ్యక్తం చేశారు.
Read Also : India War : పాక్ స్టాక్ మార్కెట్ కుదేల్