పశ్చిమ బెంగాల్లో 25,000 మంది ఉపాధ్యాయుల ఉద్యోగాలు రద్దైన ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. సుప్రీంకోర్టు సంచలన తీర్పుతో ఈ ఉదంతం మరింత వేడెక్కింది. ఈ తీర్పుతో బాధిత ఉపాధ్యాయులు కంటతడి పెట్టగా, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ తీర్పును తాను ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోనని మమతా బెనర్జీ స్పష్టం చేశారు. “నన్ను జైలులో పెట్టినా సరే… అయినా ఈ తీర్పును అంగీకరించను,” అని స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు తీర్పును వ్యతిరేకంగా మాట్లాడడం కోర్టు ధిక్కారంగా పరిగణించవచ్చని అంగీకరించినప్పటికీ, ఉద్యోగాల రద్దును తాను ఒప్పుకోలేనని తేల్చిచెప్పారు.

“నా హయాంలో ఎవరూ ఉద్యోగం కోల్పోరు”
“నేను బతికినంత కాలం ఏ ఒక్క ఉపాధ్యాయుడు ఉద్యోగం కోల్పోడు,” అని మమతా ధీమాగా చెప్పారు. ఉపాధ్యాయుల న్యాయంగా సంపాదించిన ఉద్యోగాలను రక్షించడమే తన మొదటి బాధ్యత అని పేర్కొన్నారు. ఉద్యోగులను కాపాడే బాధ్యతను తానొక తల్లిగా తీసుకుంటానని భావోద్వేగంతో తెలిపారు.”నన్ను సవాల్ చేసే వారికి సమాధానం చెప్పే శక్తి నాకుంది,” అంటూ ప్రత్యర్థులపై ఘాటుగా విరుచుకుపడ్డారు. రాజకీయంగా తమను బలహీనపరిచేందుకు ఇదంతా కుట్రగా మమత అభిప్రాయపడ్డారు. కోర్టు తీర్పు వెనుక ఉన్న లక్ష్యం రాజకీయ ప్రయోజనాలేనని ఆమె వ్యాఖ్యానించారు.
ఉద్యోగాలు కోల్పోతామన్న ఆందోళనతో ఉపాధ్యాయులు నిరాశలో మునిగిపోతుండగా, మమత బెనర్జీ ఇచ్చిన హామీ వారికి కొంత ఊరట ఇచ్చింది. “మీరు నన్ను నమ్మండి. మీతో ఉన్నాను,” అంటూ మమత భావోద్వేగంగా మాట్లాడారు.
అప్పటి తీర్పుకు వ్యతిరేకంగా లీగల్ ఫైట్?
ఇక బెంగాల్ ప్రభుత్వం కొత్తగా నియామకాలు చేపట్టాలని సుప్రీం సూచించినా, మమత బెనర్జీ ప్రభుత్వ దిశ వేరేలా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ కేసును మరోసారి రివ్యూ పిటిషన్ ద్వారా తిరగదోదాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు సమాచారం.ఈ పరిణామాలు చూస్తుంటే పశ్చిమ బెంగాల్ రాజకీయాలు మరో మలుపు తిప్పేలా ఉన్నాయి. మమత బెనర్జీ ఓవైపు న్యాయస్థాన నిర్ణయాన్ని ఎదుర్కొంటూ, మరోవైపు ఉద్యోగుల్ని ఆదుకునే యోచనలో ఉండటం గమనార్హం.
Read Also : Rahul Gandhi: యువతకు ఉపాధి కల్పించిన రాహుల్ గాంధీ