వరంగల్(Warangal)నగరంలో మానవత్వాన్ని కదిలించే సంఘటన చోటుచేసుకుంది. హనుమకొండ న్యూ శాయంపేటలో ఓ చిన్నారి వీధికుక్కల బారినపడింది. చిట్టి అనే బాలిక చేతిలో కవర్ పట్టుకొని ఇంటికి వెళ్తుండగా, రోడ్డుకిరువైపుల కాపు కాసిన పది కుక్కలు ఒక్కసారిగా ఆమెపై విరుచుకుపడ్డాయి. క్షణాల్లోనే బాలికను చుట్టుముట్టి విచక్షణారహితంగా దాడి చేశాయి. భయంతో చిన్నారి గట్టిగా అరవడంతో అక్కడే ఉన్న ఓ వ్యక్తి అప్రమత్తమయ్యాడు. వెంటనే రాళ్లు విసురుతూ కుక్కలను తరిమి బాలిక ప్రాణాలు కాపాడాడు. తీవ్ర గాయాలపాలైన బాలికను స్థానికులు సమీప ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ఆమె పరిస్థితి స్థిరంగా ఉందని తెలిపారు.
అదే సమయంలో మరో దాడి – బాలుడు తృటిలో రక్షణ
Warangal: అదే సమయంలో హనుమకొండ లస్కర్ సింగారంలో మరో దారుణం చోటుచేసుకుంది. ఒంటరిగా నడుస్తున్న ఓ బాలుడిపైన కూడా వీధికుక్కల దాడి జరిగింది. అక్కడి స్థానికులు సమయానికి స్పందించి కుక్కలను తరిమేయడంతో బాలుడు ప్రాణాలతో బయటపడ్డాడు.
తాజాగా నగరంలో వీధికుక్కల దాడులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజల్లో భయం నెలకొంది. పిల్లలు బయటకు వెళ్లేందుకు కూడా తల్లిదండ్రులు భయపడుతున్నారు.
నగరవాసుల ఆగ్రహం – అధికారుల నిర్లక్ష్యం పై మండిపాటు
నిత్యం వీధికుక్కలు చెలరేగిపోతున్నా, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (GWMC) అధికారులు మాత్రం చర్యలు తీసుకోవడంలో విఫలమవుతున్నారు. స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఈ దాడులు ఆగేలా వెంటనే కుక్కల నియంత్రణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. మున్సిపల్ అధికారులు తగిన చర్యలు తీసుకోకపోతే పరిస్థితి మరింత విషమిస్తుందని హెచ్చరిస్తున్నారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: