Telegram piracy channels : డిజిటల్ పైరసీని అరికట్టేందుకు భారత ప్రభుత్వం కఠిన చర్యలు ప్రారంభించింది. ప్రముఖ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్లో అక్రమంగా సినిమాలు, వెబ్సిరీస్లను పంపిణీ చేస్తున్న ఛానళ్లపై కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ చర్యలు చేపట్టింది.
సుమారు 3,142 పైరసీ ఛానళ్లను వెంటనే తొలగించాలని టెలిగ్రామ్ సంస్థకు ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది.
మూడు గంటల గడువు
పైరసీ కంటెంట్ను హోస్ట్ చేస్తున్నట్లు గుర్తించిన ఈ ఛానళ్లను కేవలం మూడు గంటలలోపే తొలగించాలని కేంద్రం ఆదేశించింది. ఈ ఆదేశాలను పాటించకపోతే ఐటీ చట్టం ప్రకారం టెలిగ్రామ్కు ఉన్న చట్టపరమైన రక్షణలు కోల్పోయే అవకాశం ఉందని హెచ్చరించింది.
ఓటీటీ సంస్థల ఫిర్యాదు
జియో సినిమా, అమెజాన్ ప్రైమ్ వీడియో వంటి ప్రముఖ ఓటీటీ సంస్థలు ప్రభుత్వానికి ఫిర్యాదు చేశాయి. భారీ బడ్జెట్ సినిమాలు, వెబ్సిరీస్లు విడుదలైన కొన్ని గంటల్లోనే టెలిగ్రామ్ ఛానళ్లలో పైరసీ రూపంలో అందుబాటులోకి వస్తున్నాయని వారు తెలిపారు.
దీంతో తమకు భారీ ఆర్థిక నష్టం వాటిల్లుతోందని పేర్కొన్నారు.
Read Also: Youssef Pejeskian: మొజ్తాబా ఖమేనీ సురక్షితంగా ఉన్నారు
ఐటీ చట్టం కింద చర్యలు
కేంద్రం ఈ చర్యలను ఐటీ చట్టం 2000 మరియు 2021 డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్ రూల్స్ ప్రకారం చేపట్టింది. అధికారుల ప్రకారం దాదాపు 1,166 టైటిళ్లకు సంబంధించిన పైరసీ లింకులు ఈ ఛానళ్లలో ఉన్నట్లు గుర్తించారు.
ప్రభుత్వం రూపొందించిన 120 పేజీల నివేదికలో ప్రతి ఛానల్ పేరు, URL, అందులో ఉన్న పైరసీ లింకుల వివరాలు నమోదు చేశారు. కొన్ని ఛానళ్లలో ఏకంగా 2,000కు పైగా పైరసీ లింకులు ఉన్నట్లు అధికారులు తెలిపారు.
డిజిటల్ వేదికలపై కాపీరైట్ ఉల్లంఘనలను ప్రభుత్వం ఇకపై కఠినంగా ఎదుర్కొంటుందని ఈ చర్యతో స్పష్టం చేసింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: