Pahalgam Terror Attack : పహల్గాం ఉగ్రదాడికి భారత సైన్యం అంతకంతకు ప్రతీకారం తీర్చుకుంటుంది. 26 మంది అమాయక ప్రజలను పొట్టనబెట్టుకున్న ఉగ్రమూకలను వెటాడి వెంటాడి మరీ చంపుతోంది. ఈ క్రమంలోనే పహల్గాం ఉగ్రదాడితో ప్రమేయమున్న లష్కరే తోయిబా టాప్ కమాండర్ అల్తాఫ్ లల్లీని భద్రతా దళాలు మట్టుబెట్టాయి. బందిపోరాలో శుక్రవారం జరిగిన ఎన్ కౌంటర్లో అల్తాఫ్ లల్లీని అంతమొందించారు జవాన్లు. పహల్గాం ఉగ్రదాడి తర్వాత టెర్రరిస్టుల కోసం భద్రతా దళాలు సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి.

బందిపోరాలో సెర్చ్ ఆపరేషన్
ఈ క్రమంలోనే శుక్రవారం కుల్నార్, బందిపోరాలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారని భద్రతా దళాలకు నిఘా వర్గాల నుంచి సమాచారం అందింది. వెంటనే అప్రమత్తమైన భద్రతా దళాలు, జమ్మూ కాశ్మీర్ పోలీసులు.. బందిపోరాలో సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. జవాన్ల రాకను గమనించిన ఉగ్రమూకలు ఒక్కసారిగా వారిపై కాల్పులకు తెగబడ్డారు.
భద్రతా దళాలు తిరిగి ఎదురు కాల్పులు
వెంటనే తేరుకున్న భద్రతా దళాలు తిరిగి ఎదురు కాల్పులు జరిపారు. భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య భీకరంగా ఫైరింగ్ జరిగింది. భద్రతా దళాల కాల్పుల్లో ఎల్ఈటీ టాప్ కమాండర్ అల్తాఫ్ లల్లీ హతమయ్యాడు. ఉగ్రవాదుల కాల్పుల్లో ఇద్దరు జవాన్లు కూడా గాయపడగా.. చికిత్స నిమిత్తం వారిని వెంటనే అధికారులు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందనే విషయం తెలియాల్సి ఉంది.
ఇప్పటి వరకైతే ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు
ఇప్పటి వరకైతే ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు. అంతకముందు.. పుల్వామా జిల్లా త్రాల్లోని మోంఘమా ప్రాంతంలో పహల్గాం ఉగ్రదాడిలో కీలక పాత్ర పోషించిన టెర్రరిస్టులు ఆదిల్ షేక్, ఆసిఫ్ షేక్ ఇళ్లను ఐఈడీ బాంబులతో భద్రతా దళాలు ఇంటిని నేలమట్టం చేశాయి. వీరితో పాటు మరికొందరు లోకల్ టెర్రరిస్టుల స్థావరాలను కూడా జవాన్లు ధ్వంసం చేశారు. మరికొందరు ముష్కరుల కోసం జమ్మూ కాశ్మీర్ వ్యాప్తంగా భద్రతా దళాలు సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి.
Read Also: పారా మిలిటరీ బలగాలకు సెలవులు రద్దు