ఆంధ్రప్రదేశ్లోని ఉమ్మడి కర్నూలు జిల్లా అత్యంత పేదరికాన్ని ఎదుర్కొంటున్న జిల్లాగా సోషియో-ఎకనామిక్ సర్వేలో వెల్లడైంది. ఈ సర్వే ప్రకారం, కర్నూలు జిల్లాలో 42 శాతం మంది ప్రజలు పేదరిక రేఖకు దిగువన జీవిస్తున్నట్లు గుర్తించారు. ఆర్థిక, సామాజిక పరిస్థితుల ప్రభావంతో ఈ జిల్లా రాష్ట్రంలోనే అత్యధిక పేదరికాన్ని ఎదుర్కొంటున్నదని నివేదిక వెల్లడించింది. ఇది ప్రభుత్వానికి ఆందోళన కలిగించే అంశంగా మారింది.
అభివృద్ధి, ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో పేదరికం
ఈ సర్వేలో పశ్చిమగోదావరి జిల్లా అత్యంత తక్కువ పేదరికం ఉన్న ప్రాంతంగా గుర్తింపు పొందింది. ఆ తర్వాత కడప, గుంటూరు, కృష్ణ జిల్లాలు పేదరికం తక్కువగా ఉన్న జిల్లాలుగా నిలిచాయి. అభివృద్ధి, ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో పేదరికం తక్కువగా ఉండటాన్ని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. పరిశ్రమలు, వ్యవసాయం, వ్యాపార అవకాశాలు మెరుగ్గా ఉండే జిల్లాల్లో పేదరికం తక్కువగా ఉండగా, కర్నూలు వంటి వెనుకబడిన జిల్లాల్లో పరిస్థితి భిన్నంగా కనిపిస్తోంది.

కర్నూలుతో పాటు చిత్తూరు, శ్రీకాకుళం, నెల్లూరు
కర్నూలుతో పాటు చిత్తూరు, శ్రీకాకుళం, నెల్లూరు, అనంతపురం, తూర్పుగోదావరి, ప్రకాశం, విశాఖపట్నం, విజయనగరం జిల్లాలు కూడా పేదరిక స్థాయిలో ఉన్నాయని ఈ నివేదిక పేర్కొంది. ముఖ్యంగా గిరిజనులు నివసించే ప్రాంతాల్లో పేదరికం తీవ్రంగా ఉండటాన్ని నివేదిక హైలైట్ చేసింది. అభివృద్ధి అవకాశాల లోపం, ఉపాధి దెబ్బతినడం, తక్కువ ఆదాయ వనరులు పేదరికానికి ప్రధాన కారణాలుగా భావిస్తున్నారు.
వెనుకబడిన జిల్లాల్లో విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలను మెరుగుపరిచేందుకు ప్రత్యేక కార్యచరణ
ఈ నివేదిక రాష్ట్ర ప్రభుత్వాన్ని వెంటనే చర్యలు తీసుకునేలా చేస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా, వెనుకబడిన జిల్లాల్లో విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలను మెరుగుపరిచేందుకు ప్రత్యేక కార్యచరణ అవసరమని సూచిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని మరిన్ని సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తేనే పేదరికాన్ని తగ్గించే అవకాశం ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.