తెలంగాణ మాజీ మంత్రి హరీశ్ రావు (Harishrao), సీఎం రేవంత్ రెడ్డి పై తీవ్ర విమర్శలు చేశారు. కేసీఆర్ను “వాటర్ మ్యాన్” అని అభివర్ణిస్తూ, రేవంత్ రెడ్డిని “వాటా మ్యాన్” అని విమర్శించారు. “అదృష్టం బాగా ఉండి సీఎం అయ్యావు, ఐదేళ్లు పదవిలో ఉండి మంచిగా పాలించు. తెలంగాణ ప్రజలకు నీళ్ల విషయంలో అన్యాయం చేయకు. ఇప్పటికే నువ్వు తెలంగాణ ద్రోహిగా చరిత్రలో ఎక్కావు, కానీ రాష్ట్ర ద్రోహిగా మిగలకూ” అంటూ రేవంత్ను హరీశ్ ఎద్దేవా చేశారు. అబద్ధాలు చెప్పడం మానేయాలని సూచించారు.
ఉత్తమ్ కుమార్ రెడ్డిపై విమర్శలు.. సీతారామ అనుమతులపై క్లారిటీ
నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar) కూడా సమగ్ర అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని హరీశ్ రావు ఆరోపించారు. “ఉత్తమ్ కూడా రేవంత్ లాగే అబద్ధాల వాడి ముఖ్యమంత్రి అయ్యే ప్రయత్నం చేస్తున్నాడు” అన్నారు. సీతారామ ప్రాజెక్టుకు సంబంధించి అనుమతుల విషయమై, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే 2023లో 25 అనుమతులు వచ్చాయని స్పష్టం చేశారు. పర్యావరణ, హైడ్రాలజీ సహా అన్ని కీలక అనుమతులు అప్పుడే తీసుకున్నామని చెప్పారు. అసెంబ్లీలో వీరంగా చర్చకు సిద్ధమని ప్రకటించారు.
వెనుకబాటు వద్దు.. అసెంబ్లీలో చర్చకు సవాల్
“రేపే అసెంబ్లీ పెడితే, కృష్ణా-గోదావరి నదులపై నెల రోజుల చర్చకు సిద్ధం. ఒక్క షరతే మైక్ కట్ చేయొద్దు, పారిపోకండి” అంటూ హరీశ్ రావు అధికార కాంగ్రెస్ ప్రభుత్వానికి సవాల్ విసిరారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి వ్యాఖ్యలను ఉదహరిస్తూ, బనకచర్ల విషయంలో చంద్రబాబు కోవర్టులు తెలంగాణలో ఉన్నారన్న ఆరోపణపై స్పందిస్తూ, “ఆ కోవర్టు ఎవరో అనిరుధ్ చెప్తే బాగుంటుంది” అన్నారు. దీంతో తెలంగాణలో నీటి హక్కుల విషయంలో రాజకీయ వేడి మరింత పెరిగింది.
Read Also : Pasamylaram fire accident: సిగాచీ పరిశ్రమ వద్ద బాధితుల కుటుంబసభ్యుల ఆందోళన