తెలంగాణ హైకోర్టు సిట్టింగ్ జడ్జిగా బాధ్యతలు నిర్వహిస్తున్న జస్టిస్ గిరిజా ప్రియదర్శిని ఆదివారం (మే 4) నాడు అనారోగ్యంతో హైదరాబాద్లో తుదిశ్వాస విడిచారు. ఆమె వయస్సు 61 సంవత్సరాలు. గత కొన్ని నెలలుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ చికిత్స పొందుతున్న ఆమె ఆరోగ్యం శనివారం రాత్రి నుంచి విషమించగా, ఆదివారం ఉదయం మృతి చెందారు. ఈ వార్త న్యాయ రంగాన్ని తీవ్ర విషాదంలో ముంచేసింది. జస్టిస్ ప్రియదర్శినికి భర్త డాక్టర్ కె విజరు కుమార్, ఇద్దరు కుమారులు నిఖిల్, అఖిల్ ఉన్నారు.

విద్యార్హతలు మరియు న్యాయ రంగానికి ప్రవేశం
జస్టిస్ గిరిజా ప్రియదర్శిని ఏపీలోని విశాఖపట్టణానికి చెందిన వ్యక్తి. ఆమె ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి సోషియాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పొలిటికల్సైన్స్లో పీజీ పూర్తి చేశారు. 1995లో విశాఖపట్నంలోని ఎన్.బి.ఎం లా కాలేజీ నుంచి న్యాయశాస్త్ర పట్టా పొందారు. 1997లో ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి లేబర్ అండ్ ఇండస్ట్రియల్ లాలో ఎల్.ఎల్.ఎం. పూర్తిచేశారు. 1995లో న్యాయవాదిగా తన వృత్తిని ప్రారంభించిన జస్టిస్ ప్రియదర్శిని, విశాఖపట్నంలో సివిల్, క్రిమినల్, లేబర్ లా, వైవాహిక వివాదాలకు సంబంధించి ఎన్నో కేసులను వాదించారు. 2008 నవంబర్లో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా జిల్లా జడ్జిగా ఎంపికై న్యాయ సేవలో చేరారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో అదనపు జిల్లా జడ్జిగా సేవలందించారు. అనంతరం పదోన్నతి పొంది, 2022 మార్చి 24న తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేశారు. సీనియారిటీ ప్రకారం ఆమె 16వ స్థానంలో ఉన్నారు. వచ్చే ఏడాది ఆమె పదవీ విరమణ చేయాల్సి ఉంది.
అంత్యక్రియలు
జస్టిస్ ప్రియదర్శిని భౌతికకాయాన్ని హఫీజ్పేటలోని ఆమె నివాసంలో ఉంచారు. అంత్యక్రియలు సోమవారం నాడు జూబ్లీహిల్స్లోని మహాప్రస్థానంలో నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. జస్టిస్ ప్రియదర్శిని మృతి పట్ల హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజోయ్ పాల్, ఇతర న్యాయమూర్తులు, న్యాయవాదులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలిపారు.
Read also: Telangana : మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి భూ భారతి – రైతులకు రక్షణ కవచం