జమ్మూ కశ్మీర్లోని పహల్గాం వద్ద ఇటీవల జరిగిన ఉగ్రదాడిలో 26 మంది అమాయక పౌరులు దుర్మరణం చెందడం దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహానికి దారితీసింది. ఈ ఘటన దేశ భద్రతా వ్యవస్థపై పలు ప్రశ్నలను లేవనెత్తడంతోపాటు, భారత్ – పాకిస్థాన్ మధ్య సంబంధాలను మరింత ఉద్విగ్నతకు గురి చేసింది. ఈ దాడికి లష్కరే తోయిబా వంటి పాక్ ఆధారిత ఉగ్ర సంస్థల ప్రమేయం ఉన్నట్టు ప్రాథమిక దర్యాప్తు వెల్లడించింది.
భారత్ పలు కీలక నిర్ణయాలు
ఈ దాడికి ప్రతిస్పందనగా భారత ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. సింధు జలాల ఒప్పందాన్ని పునఃసమీక్షించడం, పాక్ పౌరులకు వీసాల రద్దు, ఎగుమతులు-దిగుమతుల నిలుపుదల, అటారీ-వాఘా బోర్డర్ మూసివేత వంటి చర్యల ద్వారా పాకిస్థాన్ను అంతర్జాతీయంగా ఒత్తిడికి గురిచేస్తోంది. ఇది కేవలం ప్రతీకార చర్య మాత్రమే కాకుండా, ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే దేశాల పట్ల భారత్ తీసుకుంటున్న స్పష్టమైన స్థానం అని విశ్లేషకులు చెబుతున్నారు.
దేశంలోని పాక్ పౌరుల బహిష్కరణ – అమిత్ షా ఆదేశాలు
ఈ నేపథ్యంలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కీలక ఆదేశాలు జారీ చేశారు. దేశంలో నివసిస్తున్న పాకిస్థాన్ పౌరులు ఏప్రిల్ 27లోపు భారత్ విడిచి వెళ్లాల్సిందిగా ఆదేశించారు. ఇది దేశ భద్రతా పరిరక్షణలో భాగంగా తీసుకున్న చర్యగా పేర్కొనబడింది. ఈ ఆదేశాల వల్ల అనేక మంది పాక్ పౌరులు తమ బంధువులను వదిలి స్వదేశానికి వెళ్లాల్సి వచ్చింది.
సీఆర్పీఎఫ్ జవాన్ మునీర్ అహ్మద్ వివాదం
ఈ పరిణామాల మధ్య జమ్మూ ప్రాంతానికి చెందిన సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ మునీర్ అహ్మద్ ఆయన 2017లో సీఆర్పీఎఫ్లో జాయిన్ అయ్యారు. కానీ ఆయన 2024లో పాకిస్థాన్ కు చెందిన యువతిని వీడియో కాల్ ద్వారా ఆన్లైన్లో వివాహం చేసుకున్నారు. అనంతరం ఆమె ఈ ఏడాది ఫిబ్రవరిలో భారత్కు తాత్కాలిక వీసాతో వచ్చారు. దీన్ని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం మునీర్ను విధుల నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
మునీర్ వాదన – వివాహం అధికార అనుమతితోనే జరిగింది
మునీర్ మాత్రం తన వివాహం సీక్రెట్ మ్యారేజ్ కాదని, అన్ని అధికారిక అనుమతులతోనే జరిగినదని వాదిస్తున్నారు. తాను అధికారులకు ముందుగానే తెలియజేశానని, పాస్పోర్ట్ మరియు గుర్తింపు పత్రాలు సమర్పించిన తర్వాతే అనుమతి ఇచ్చారని తెలిపారు. అంతేకాకుండా తన భార్య లాంగ్ టర్మ్ వీసాకు అప్లై చేసిన సమయంలో పరిస్థితులు మార్చిపోయాయని చెబుతున్నారు. ఈ క్రమంలో పహల్గాం ఉగ్రదాడి జరగడంతో పరిస్థితులు మారిపోయాయి. అయితే తాజాగా కోర్టు స్టే విధించడంతో ప్రస్తుతం ఆమె జమ్ములోని మునీర్ ఇంట్లోనే ఉంటోంది. అయితే తాజాగా తనను విధుల నుంచి తీసివేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుందని మునీర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు తనకు తొలగిస్తున్నట్లు ఉన్న లేఖను పంపించారని అన్నారు. ఈ విషయంపై తాను కోర్టులో పిటిషన్ దాఖలు చేస్తానని.. న్యాయం తమవైపే ఉందని మునీర్ అన్నారు.
Read also: Ukraine: నెల రోజుల పాటు కాల్పుల విరమణకు తాము సిద్ధం: జెలెన్ స్కీ