మద్దతు ఇవ్వాలని అమెరికాను ఇజ్రాయెల్ కోరినట్లు వెల్లడి
జెరూసలేం : ఇరాన్పై ఇజ్రాయెల్ మరోసారి యుద్ధానికి కాలుదువ్వుతున్నట్లుగా కనిపిస్తోంది. ఇందుకోసం రంగం సిద్ధం చేసుకున్నట్లు వార్తలు వెలుగులోకి వచ్చాయి. ఇరాన్లోని అణుస్థావరాలపై దాడి చేసేందుకు ఇజ్రాయెల్ సన్నాహాలు చేసుకుంటున్నట్లు అమెరికా నిఘా వర్గాలు నివేదించాయి. ఇదే విషయాన్ని వాషింగ్టన్ పోస్ట్, వాల్స్ట్రీట్ జర్నల్లు కథనాలు వెలువరిచాయి.
ఈ ఏడాది మధ్యలో దాడులు జరగొచ్చని అంచనా వేస్తున్నారు. హమాస్తో యుద్ధం జరిగిస్తున్న సమయంలో కూడా ఇరాన్పై ఇజ్రాయెల్ దాడులు చేసింది. ఆ సమయంలో కోలుకోలేని దెబ్బకొట్టినట్లుగా వార్తలు వినిపించాయి. తాజాగా అంతకంటే ఎక్కువగా దాడులు చేయొచ్చని సమాచారం. ఇక ఈ దాడులకు ట్రంప్ మద్దతు కోరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

అమెరికా నుంచి మద్దతు లభిస్తే.. ఇరాన్పై నేరుగా ఇజ్రాయెల్ యుద్ధానికి దిగే అవకాశం ఉంది. హమాస్తో యుద్ధం జరిగిస్తున్న సమయంలో ఇజ్రాయెల్పై 170 రాకెట్లు ప్రయోగించింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. గగనతలంలోనే రాకెట్లను ఇజ్రాయెల్ కూల్చేసింది. దీనికి ప్రతీకారంగా ఇజ్రాయెల్ కూడా ఇరాన్పై దాడి చేసింది.
మరోవైపు వాషింగ్టన్ పోస్టుతో శ్వేతసౌధం ఎన్ఎస్సీ ప్రతినిధి బ్రియాన్ హ్యూస్ మాట్లాడుతూ.. ఇరాన్ అణ్వాయుధ తయారీకి ట్రంప్ ప్రభుత్వం సహకరించదని స్పష్టం చేశారు. ఇరాన్తో చర్చలు జరిపేందుకు ప్రయత్నిస్తామని, అది సాధ్యం కాకపోతే ఇతర మార్గాలను పరిశీలిస్తామని తెలిపారు. ఇటీవల ఫాక్స్ న్యూస్తో ట్రంప్ కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. తాను ఒప్పందానికి సిద్ధంగా ఉన్నా, ఇరాన్ మాత్రం ఘర్షణకే ఆసక్తి చూపుతోందని పేర్కొన్నారు. ఇరాన్లోని ఫాద్వా, నటాంజ్ అణుస్థావరాలపై దాడులు జరగొచ్చని అమెరికా ఇంటెలిజెన్స్ జనవరిలోనే హెచ్చరించింది.