ఉక్రెయిన్-అమెరికా మధ్య ఎట్టకేలకు ఖనిజాల ఒప్పందం కుదిరింది. బుధవారం రెండు దేశాలు ఈ ఒప్పందంపై సంతకం చేశాయి. దీంతో ఉక్రెయిన్లో ఉండే అరుదైన సహజ వనరులపై అమెరికాకు అనుమతి లభించింది. ఇరు దేశాల మధ్య కుదిరిన ఈ విస్తృత ఆర్థిక ఒప్పందం విలువ దాదాపు బిలియన్ డాలర్లు ఉంటుంది.
యూఎస్ ట్రెజరీ సెక్రటరీతో ఉక్రెయిన్ డిప్యూటీ ప్రధాని భేటీ..
బుధవారం యూఎస్ ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బీసెంట్, ఉక్రెయిన్ ఫస్ట్ డిప్యూటీ ప్రధాని యులియా సిర్దెంకో భేటీ అయ్యారు. ఈ సమయంలోనే ఖనిజాల తవ్వకాలు, ఉక్రెయిన్ పునర్నిర్మాణానికి కావాల్సిన ఆర్థిక విషయాలపై పలు కీలక ఒప్పందాలపై సంతకాలు చేశారు. రెండు దేశాల మధ్య ఈ ఒప్పందం కుదరడం వల్ల ఉక్రెయిన్లో అమెరికా సంయుక్త నిధిని ఏర్పాటు చేయనుంది. ఉక్రెయిన్ పునర్నిర్మాణానికి చేపట్టాల్సిన పలు అభివృద్ధి ప్రాజెక్టుల్లో అమెరికా పెట్టుబడిదారులకు ప్రాధాన్యత లభించనుంది.దాదాపు మూడేళ్లుగా రష్యాతో యుద్ధం చేస్తున్న ఉక్రెయిన్కు సాయం చేసేందుకు అమెరికా పన్నుదారుల డబ్బును చాలా ఉపయోగిస్తారు. ఉక్రెయిన్లో ఉండే అల్యూమినియం, గ్రాఫైట్, చమురు, సహజ వాయువు, ఇతర ఖనిజాలను తవ్వుకునేందుకు అమెరికాకు అనుమతి ఉంటుంది. తద్వారా అమెరికా ఇచ్చిన నిధులను తిరిగి చెల్లించడానికి ఉక్రెయిన్కు అవకాశం లభిస్తుందన్నారు.
ఆర్థిక ఒప్పందంపై అమెరికా ట్రెజరీ డిపార్ట్మెంట్ స్పందిస్తూ ఉక్రెయిన్ పునర్నిర్మాణానికి కావాల్సిన ఉమ్మడి పెట్టుబడి నిధిని స్థాపించడానికి రెండు దేశాలు సంతకాలు చేశాయని తెలిపింది. స్వేచ్ఛాయుత, సార్వభౌమ, సంపన్నమైన ఉక్రెయిన్ కోసం ట్రంప్ నిబద్ధతను ఈ చరిత్రాత్మక ఆర్థిక భాగస్వామ్యం సూచిస్తుందని ఎక్స్లో పోస్ట్ చేసింది.
ట్రంప్, జెలెన్స్కీ మధ్య మాటల యుద్ధం..
రష్యాతో యుద్ధాన్ని ముగించేందుకు తమ దేశం చొరవ తీసుకుంటుందని, అందుకు బదులుగా ఉక్రెయిన్లో ఖనిజాల తవ్వకానికి తమను అనుమతించాలని డొనాల్డ్ ట్రంప్ గతంలో కీవ్పై ఒత్తిడి తెచ్చారు. అయితే ఈ ఏడాది ఫిబ్రవరిలోనే ఖనిజాల ఒప్పందంపై ఇరుదేశాలు సంతకం చేయాల్సి ఉండేది. అందుకోసం ఓవల్ కార్యాలయంలో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే ట్రంప్, జెలెన్స్కీ మధ్య మీడియా ముందే మాటల యుద్ధం జరిగింది. అప్పటినుంచి ఒప్పందం అలాగే ఉండిపోయింది. అయితే ఈ ఒప్పందం కోసం ఇరుదేశాలు చాలా రోజులుగా ప్రయత్నాలు సాగించాయి. ఎట్టకేలకు బుధవారం ఇరుపక్షాలు అంగీకరించాయి.
Read Also: In-Pakistan: భారత సైన్యం పైకి పాక్ కాల్పులు..తిప్పికొట్టిన సైనికులు