అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Trump ) భారత్ కు బిగ్ షాక్ ఇచ్చాడు. భారతదేశం నుంచి వచ్చే ఉత్పత్తులపై ఏకంగా 25 శాతం దిగుమతి సుంకాలు (25% Tariffs) విధిస్తున్నట్టు తెలిపారు. ఈ టారిఫ్లు 2025 ఆగస్ట్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. అదనంగా రష్యాతో వ్యాపార సంబంధాల కారణంగా భారత్పై పెనాల్టీ సుంకాలు కూడా ఉంటాయని ట్రంప్ పేర్కొన్నారు. భారత్ తమ దేశ వస్తువులపై ఎక్కువ సుంకాలు విధించడం, రష్యా నుంచి సైనిక సామాగ్రి, ఇంధన వస్తువులు దిగుమతి చేసుకోవడమే ఈ చర్యలకు ప్రధాన కారణమని చెప్పారు. రెండు దేశాల మధ్య వాణిజ్య చర్చలు కొనసాగుతున్న నేపథ్యంలో ట్రంప్ ఆకస్మికంగా ఈ ప్రకటన చేయడం ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
రష్యా నుంచి ఆయుధాల కొనుగోలు
భారత్ రష్యాతో కొనసాగిస్తున్న వ్యాపార సంబంధాలు ముఖ్యంగా ట్రంప్కు అసహనంగా మారాయి. చైనా తర్వాత రష్యా నుంచి ఎక్కువగా ఇంధనం కొనుగోలు చేస్తున్న దేశం భారత్నే అని ట్రంప్ విమర్శించారు. ఉక్రెయిన్పై రష్యా దాడులను ప్రపంచం తీవ్రంగా ఖండిస్తున్నప్పటికీ, భారత్ రష్యాతో వ్యాపారాన్ని కొనసాగించడం సరైంది కాదని అభిప్రాయపడ్డారు. “భారత్ మన మిత్రదేశమే అయినా, తమ విధానాల్లో మార్పులు రాకపోతే అటువంటి చర్యలు తప్పవు” అని ట్రంప్ ట్రూత్ సోషల్లో పేర్కొన్నారు. గతంలో ఏప్రిల్లోనూ భారత్పై టారిఫ్లు ప్రకటించినప్పటికీ, వాటిని తాత్కాలికంగా వాయిదా వేశారు. కానీ ఇప్పుడు డెడ్లైన్ సమీపిస్తున్న నేపథ్యంలో మరోసారి కఠినంగా వ్యవహరించారు.
ద్వైపాక్షిక వాణిజ్యంపై తీవ్ర ప్రభావం
ఇది రెండు దేశాల మధ్య వాణిజ్యానికి గట్టి దెబ్బగా మారే అవకాశం ఉంది. అమెరికా భారత్కు అతిపెద్ద వాణిజ్య భాగస్వామి. 2024లో ఇరుదేశాల మధ్య 190 బిలియన్ డాలర్ల విలువైన వాణిజ్యం జరిగింది. ఇరు దేశాల నాయకులు గతంలో 2030 నాటికి వాణిజ్యాన్ని 500 బిలియన్ డాలర్లకు పెంచాలనే లక్ష్యాన్ని ప్రకటించారు. కానీ తాజా పరిణామాలతో ఆ దిశగా అడుగులు ముందుకు పడటం అనుమానంగా మారింది. పరస్పర సుంకాలు, పెనాల్టీలతో వాణిజ్య నెమ్మదించడంతో పాటు భారత ఎగుమతిదారులకు భారీ నష్టాలు వచ్చే ప్రమాదం ఉంది. ఇప్పుడు భారత్ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో, తదుపరి కార్యాచరణ ఎలా ఉంటుందో అని అంతా ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు.
Read Also : Tea: టీ తాగిన వెంటనే తినకూడని ఆహార పదార్థాలు