చైనా నుంచి పెరుగుతున్న తక్కువ ధరల ఉక్కు దిగుమతులను(Steel Imports) నియంత్రించేందుకు భారత ప్రభుత్వం కీలక వాణిజ్య చర్యలకు శ్రీకారం చుట్టింది. ఎంపిక చేసిన ఉక్కు ఉత్పత్తులపై మూడు సంవత్సరాల కాలానికి దిగుమతి సుంకం (సేఫ్గార్డ్ డ్యూటీ) విధిస్తున్నట్లు డిసెంబర్ 30న అధికారికంగా ప్రకటించింది. ఈ సుంకం దశలవారీగా తగ్గే విధానంలో అమలవుతుంది. తొలి సంవత్సరంలో 12 శాతం, రెండో సంవత్సరంలో 11.5 శాతం, మూడో సంవత్సరంలో 11 శాతంగా దిగుమతి సుంకం వసూలు చేయనున్నారు.
Read also: China: భారత్-పాక్ యుద్ధంలో మా పాత్ర కూడా ఉంది..
ప్రపంచంలో రెండో అతిపెద్ద ముడి ఉక్కు(Steel Imports) ఉత్పత్తిదారుగా ఉన్న భారత్కు ఇటీవల కాలంలో చైనా నుంచి భారీగా చౌక ధరల ఉక్కు దిగుమతులు పెరిగాయి. డంపింగ్ విధానాల ద్వారా చైనా ఉక్కును మార్కెట్లోకి ప్రవేశపెడుతోందన్న ఆరోపణల నేపథ్యంలో, ఈ దిగుమతులు దేశీయ ఉక్కు తయారీ సంస్థలకు తీవ్ర పోటీని సృష్టిస్తున్నాయని కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. ఫలితంగా అనేక కంపెనీలు లాభాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడిందని అధికార వర్గాలు వెల్లడించాయి.
మూడు సంవత్సరాల పాటు సేఫ్గార్డ్ డ్యూటీ అమలు.
ఈ సుంకానికి సంబంధించిన నోటిఫికేషన్ను ప్రభుత్వం అధికారిక గెజిట్లో ప్రచురించింది. అయితే ఈ చర్య అన్ని దేశాలకు వర్తించదని స్పష్టం చేసింది. కొన్ని అభివృద్ధి చెందుతున్న దేశాల నుంచి వచ్చే ఉక్కు దిగుమతులకు మినహాయింపులు ఇవ్వగా, చైనా, వియత్నాం, నేపాల్ దేశాల నుంచి వచ్చే ఉక్కు మాత్రం ఈ సుంకం పరిధిలోకి వస్తుంది. అంతేకాకుండా, స్టెయిన్లెస్ స్టీల్ వంటి ప్రత్యేక ఉక్కు ఉత్పత్తులకు ఈ సేఫ్గార్డ్ డ్యూటీ వర్తించదని కేంద్రం తెలిపింది.
వాణిజ్య మంత్రిత్వ శాఖతో పాటు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ట్రేడ్ రెమెడీస్ (DGTR) నిర్వహించిన విచారణలో, ఇటీవల అకస్మాత్తుగా ఉక్కు దిగుమతులు భారీగా పెరగడం వల్ల దేశీయ పరిశ్రమకు తీవ్ర నష్టం కలిగే ప్రమాదం ఉందని తేలింది. ఈ నివేదిక ఆధారంగానే మూడు సంవత్సరాల పాటు దిగుమతి సుంకం విధించాలని DGTR సిఫార్సు చేసింది.
ఇది భారత్ చేపట్టిన తొలి చర్య కాదు. ఇప్పటికే 2025 ఏప్రిల్లో విదేశీ దేశాల నుంచి వచ్చే అన్ని ఉక్కు దిగుమతులపై 200 రోజుల పాటు 12 శాతం తాత్కాలిక సుంకాన్ని ప్రభుత్వం అమలు చేసింది. ఆ చర్య నవంబర్ 2025తో ముగియగా, తాజా నిర్ణయం దానికి కొనసాగింపుగా భావిస్తున్నారు. ఇండియన్ స్టెయిన్లెస్ స్టీల్ డెవలప్మెంట్ అసోసియేషన్ (ISSDA) సహా పలు పరిశ్రమ సంస్థలు చౌక ఉక్కు దిగుమతులపై ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోవాలని గతంలోనే డిమాండ్ చేశాయి. 2025 ఆగస్టులో DGTRకు యాంటీ-డంపింగ్ సుంకాల కోసం అధికారికంగా పిటిషన్ కూడా సమర్పించాయి.
ప్రపంచవ్యాప్తంగా చైనా ఉక్కు ఎగుమతులపై వాణిజ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న వేళ భారత్ ఈ నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉక్కుపై దిగుమతి సుంకాలు విధించడంతో, చైనా ఉక్కు ఇతర మార్కెట్ల వైపు మళ్లింది. దీనితో అనేక దేశాలు తమ దేశీయ పరిశ్రమలను రక్షించుకునేందుకు కఠిన వాణిజ్య విధానాలను అమలు చేస్తున్నాయి. ఈ ఏడాది ప్రారంభంలో దక్షిణ కొరియా, వియత్నాం కూడా చైనా ఉక్కుపై యాంటీ-డంపింగ్ సుంకాలను విధించిన విషయం తెలిసిందే.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: