భారత్ – పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు తీవ్రమవుతున్న నేపథ్యంలో భారత రక్షణ శాఖ అధికారులు మీడియా ముందుకు వచ్చి పాక్ చర్యలను ఖండిస్తూ కీలక ప్రకటనలు చేశారు. భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సిందూర్ నేపథ్యంపై శనివారం ఉదయం నిర్వహించిన మీడియా సమావేశంలో, పాక్ యుద్ధ చర్యలపై, ఆ దేశం చేస్తున్న అప్రచారంపై, భారత సైన్యం ఇచ్చిన ప్రతిస్పందనపై వివరాలు వెల్లడించాయి.

ఈ సమావేశంలో భారత విదేశాంగ శాఖ ప్రతినిధి విక్రమ్ మిస్రీ, భారత సైన్యం ప్రతినిధి కల్నల్ సోఫియా ఖురేషీ, వాయుసేన ప్రతినిధి వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ పాల్గొన్నారు. పాక్ వైపు నుంచి ప్రేరితమైన యుద్ధ ప్రకోపాలను ప్రపంచ సమాజానికి తెలియజేసే క్రమంలో ఈ సమావేశం నిర్వహించబడింది.
పాక్ అప్రచారం-భారత్ వివరణ
కల్నల్ సోఫియా ఖురేషీ మాట్లాడుతూ పాక్ సైన్యం భారత సరిహద్దుల వైపు కదులుతోందని చెప్పారు. ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించేందుకు పాక్ ఎలాంటి ప్రయత్నం చేయడంలేదని ఆరోపించారు. పాక్ బలగాలు సరిహద్దులవైపు కదలడం కచ్చితంగా ప్రమాదకరమైన చర్యేనని స్పష్టం చేశారు. పంజాబ్ లోని వాయుసేన స్థావరాలపై శనివారం తెల్లవారుజామున హైస్పీడ్ మిసైళ్లతో పాక్ దాడులు చేసిందని తెలిపారు. శ్రీనగర్, అవంతిపుర, ఉధంపూర్ లలోని వైద్య కేంద్రాలపై దాడి చేసిందని చెప్పారు. ఇది ముమ్మాటికీ భారత్ ను రెచ్చగొట్టే చర్యేనని తెలిపారు. భారత మిలిటరీ స్థావరాలపై పాక్ చేస్తున్న దాడులను మన సైన్యం తిప్పికొట్టిందని వివరించారు.
భారత్ ప్రతిస్పందన:
ఈ దాడులకు తక్షణమే గట్టి ప్రతిస్పందనగా, భారత సైన్యం ఆపరేషన్ సిందూర్ లో భాగంగా పాక్ మిలటరీ స్థావరాలు, రాడార్ కేంద్రాలు, కమాండ్ కంట్రోల్ సెంటర్లపై ఆధునిక ఫైటర్ జెట్లతో గగనతల దాడులు చేసిందని ఖురేషీ వివరించారు. ఫైటర్ జెట్లతో అత్యంత కచ్చితంగా లక్ష్యాలు ఛేదించే ఆయుధాలు వాడి పస్రూర్లోని రాడార్ కేంద్రం, సియాల్ కోట్లోని ఏవియేషన్ బేస్ను ధ్వంసం చేసినట్లు తెలిపారు. ఇదే అంశాన్ని వ్యోమికా సింగ్ అంతర్జాతీయ మీడియా కోసం ఆంగ్లభాషలో వెల్లడించారు. భారత స్థావరాలు సురక్షితంగా ఉన్నాయని టైమ్ స్టాంప్లు ఉన్న వీడియోలు, ఫొటోలను మీడియా ముందు ప్రదర్శించారు. భారత వాయుసేన పూర్తి సమర్థతతో యుద్ధానికి సిద్ధంగా ఉందని, దేశ భద్రతలో ఎలాంటి రాజీ లేదని స్పష్టం చేశారు.
Read also: Operation Sindoor: ఆపరేషన్ సిందూర్.. ఇంటర్నెట్ నెటిజన్లకు కేంద్రం హెచ్చరిక