Plane Crash: గుజరాత్లోని అహ్మదాబాద్లో జరిగిన ఈ ఘోర విమాన ప్రమాదం దేశాన్ని విషాదంలో ముంచివేసింది. ఎయిర్ ఇండియాకు చెందిన బోయింగ్ 787 డ్రీమ్లైనర్ (AI-171) విమానం గురువారం మధ్యాహ్నం 1:39 గంటలకు లండన్ గ్యాట్విక్కు బయలుదేరి, కేవలం 5 నిమిషాల్లోనే కుప్పకూలింది. ఈ ప్రమాద సమయంలో విమానంలో మొత్తం 242 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బంది ఉన్నారు. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం 133 మంది మృతిచెందినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.
సహాయక చర్యలు ముమ్మరం
ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే NDRF, BSF, CISF బృందాలు సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ముమ్మరంగా చేపట్టాయి. ఇప్పటివరకు గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలించారు.
మేడే కాల్.. కానీ స్పందన లేకపోవడం ఆందోళన
విమాన ప్రమాదానికి ముందు పైలట్ మేడే కాల్ చేసినట్లు DGCA ప్రకటించింది. ఇది అత్యవసర సంకేతంగా విమాన సంబంధిత ప్రతిస్పందన అవసరమైనప్పుడు ఉపయోగిస్తారు. అయితే ఈ కాల్కు ATC (ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్) నుండి ఎలాంటి స్పందన రాలేదని తెలుస్తోంది.
పలువురు నేతల స్పందనలు
అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై జార్ఖండ్ బీజేపీ నాయకుల దిగ్భ్రాంతి
రక్షణ శాఖ సహాయ మంత్రి, బీజేపీ నాయకుడు సంజయ్ సేథ్ గురువారం అహ్మదాబాద్ విమానాశ్రయం సమీపంలో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అన్ని ప్రభుత్వ కార్యక్రమాలు వాయిదా వేస్తున్నట్లు సేథ్ మీడియాతో తెలిపారు.
జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నేత చంపాయి సోరెన్ కూడా ఈ ప్రమాదం పట్ల తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. విమాన ప్రమాదం జరిగిన కారణంగా జార్ఖండ్ బిజెపి గురువారం జరగాల్సిన అన్ని కార్యక్రమాలను రద్దు చేసింది.
అహ్మదాబాద్లో విమాన ప్రమాదం గురించి దిగ్భ్రాంతికరమైన వార్త వెలువడింది. చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. మరణించిన వారి ఆత్మకు శాంతి కలగాలని మరియు గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని బాబా బైద్యనాథ్ను ప్రార్థిస్తున్నాను” అని మాజీ జార్ఖండ్ ముఖ్యమంత్రి X లో ఒక పోస్ట్ ద్వారా తెలిపారు.
విమాన ప్రమాదంపై రాహుల్ గాంధీ దిగ్భ్రాంతి
అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై కాంగ్రెస్ ఎంపీ, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ విచారం వ్యక్తం చేశారు. ‘ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం చాలా బాధాకరం. ప్రయాణికులు, సిబ్బంది కుటుంబాలు ఆవేదన, ఆందోళన ఊహించలేం ఈ కష్టసమయంలో వారికి అండగా నిలుద్దాం.. అత్యవసర రక్షణ, సహాయక చర్యలు చాలా కీలకం – ప్రతి జీవితం ముఖ్యం, ప్రతి సెకను విలువైనది. కాంగ్రెస్ కార్యకర్తలు క్షేత్రస్థాయిలో సహాయ చర్యల్లో పాల్గొనాలి’ అని అన్నారు.
విమాన ప్రమాదం తనను ఎంతగానో కలచివేసిందని, ఈ దుర్ఘటనలో తమవారిని కోల్పోయిన కుటుంబాల బాధను తాను అర్థం చేసుకోగలనని, వారికి మనోధైర్యాన్ని ఇవ్వాలని ఆయన ఆకాంక్షించారు. ప్రభుత్వం వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని రాహుల్ గాంధీ కోరారు. ప్రతి ఒక్క ప్రాణాన్ని కాపాడటం చాలా ముఖ్యమని, సహాయక చర్యల్లో వేగం పెంచాలని ఆయన అన్నారు.
విమాన ప్రయాణీకుల జాబితా విడుదల
గురువారం మధ్యాహ్నం అహ్మదాబాద్ నుంచి బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం AI 171, బోయింగ్ 787 లండన్కు వెళ్తూ టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కూలిపోయింది. విమానంలో ప్రయాణికులు, సిబ్బందితో సహా 242 మంది ఉన్నారని ఎయిర్లైన్స్ ఎక్స్ (ట్విట్టర్)లో పోస్ట్ చేసిన ఒక అధికారిక ప్రకటనలో ధ్రువీకరించింది.
యూకే ప్రధాని కీర్ స్టార్మర్ దిగ్భ్రాంతి
అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై బ్రిటన్ ప్రధాన మంత్రి కీర్ స్టార్మర్ విచారం వ్యక్తం చేశారు. ప్రమాద దృశ్యాలను “విధ్వంసకరమైనవి”గా అభివర్ణించారు. “ప్రయాణికులకు, వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను” అని ప్రధాని కార్యాలయం డౌనింగ్ స్ట్రీట్ విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపారు.
Read also: Air India: ప్రమాదానికి ముందు ‘మేడే కాల్’ చేసిన పైలట్