స్మార్ట్ఫోన్(Smartphone) వ్యసనం ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోతున్న తరుణంలో జపాన్లోని ఐచి రాష్ట్రం, టోయోవాకే నగరం ఒక వినూత్న నిర్ణయం తీసుకుంది. ప్రజలు వినోదం కోసం స్మార్ట్ఫోన్లు, పర్సనల్ కంప్యూటర్లు,(Computers) టాబ్లెట్ల వాడకాన్ని రోజుకు కేవలం రెండు గంటలకు పరిమితం చేయాలని కోరుతూ మంగళవారం ఒక ఆర్డినెన్స్ను ఆమోదించింది. జపాన్లో ఇలాంటి నిబంధన తీసుకువచ్చిన తొలి నగరంగా టోయోవాకే నిలిచింది. ఈ కొత్త నిబంధన అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానుంది.
ఉద్దేశం, మినహాయింపులు
ఈ ఆర్డినెన్స్ కేవలం ఒక మార్గదర్శకం మాత్రమేనని, దీనిని ఉల్లంఘించిన వారిపై ఎలాంటి జరిమానాలు విధించబోమని నగర పాలక సంస్థ స్పష్టం చేసింది. చదువు, ఆఫీస్ పనులు, ఇంటి పనుల కోసం ఎలక్ట్రానిక్(Electronic) పరికరాలను ఉపయోగించడానికి ఈ నిబంధన నుంచి మినహాయింపు ఇచ్చారు. ఈ నిర్ణయం వెనుక ఉన్న ఉద్దేశాన్ని నగర మేయర్ మసఫుమి కౌకి వివరిస్తూ, “ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటమే మా ప్రధాన లక్ష్యం. స్మార్ట్ఫోన్ల వాడకం వల్ల నిద్రలేమి వంటి సమస్యలు వస్తున్నాయో లేదో ప్రజలు గమనించుకోవాలి” అని తెలిపారు.
కుటుంబ సంబంధాల పెంపు, ప్రజల స్పందన
కుటుంబ సభ్యుల మధ్య సంభాషణలు పెంచడం కూడా ఈ ఆర్డినెన్స్ లక్ష్యమని మేయర్ పేర్కొన్నారు. ఈ ఆర్డినెన్స్లో భాగంగా, ప్రాథమిక పాఠశాల విద్యార్థులు రాత్రి 9 గంటల తర్వాత, 18 ఏళ్లలోపు వారు రాత్రి 10 గంటల తర్వాత స్మార్ట్ఫోన్లు, ఇతర గాడ్జెట్లు వాడకుండా చూడాలని తల్లిదండ్రులకు సూచించారు. ఈ నిర్ణయంపై స్థానిక ప్రజల నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. కొందరు ఇది వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకోవడమేనని విమర్శిస్తుండగా, మరికొందరు కుటుంబంతో చర్చించడానికి ఇదొక మంచి అవకాశమని భావిస్తున్నారు.
నిబంధనలు, భవిష్యత్ కార్యాచరణ
ప్రజల అభిప్రాయాలను, నిబంధన ప్రభావాన్ని ఎప్పటికప్పుడు సమీక్షించి, అవసరమైతే మార్పులు చేస్తామని నగర కౌన్సిల్ హామీ ఇచ్చింది.
జపాన్లో స్మార్ట్ఫోన్ల వాడకంపై ఆర్డినెన్స్ తీసుకొచ్చిన మొదటి నగరం ఏది?
ఐచి రాష్ట్రంలోని టోయోవాకే నగరం.
ఈ నిబంధన ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుంది?
ఈ కొత్త నిబంధన అక్టోబర్ 1 నుంచి అమల్లోకి వస్తుంది.
Read hindi news: hindi.vaartha.com
Read Also: