భారత ప్రధాని నరేంద్ర మోదీ,(Narendra Modi) సైన్యాధిపతి జనరల్ ఉపేంద్ర ద్వివేది మధ్య విభేదాలు ఉన్నాయంటూ పాకిస్థాన్ ఆధారిత సోషల్ మీడియా ఖాతాలు చేస్తున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని కేంద్ర ప్రభుత్వం ఖండించింది. ఈ తప్పుడు వార్తలు భారతదేశంలో గందరగోళం సృష్టించే ప్రయత్నమేనని, వాటికి ఎలాంటి వాస్తవాధారం లేదని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) ఫ్యాక్ట్ చెక్ విభాగం స్పష్టం చేసింది.
పాకిస్థాన్ దుష్ప్రచారం
ఇటీవలి రోజులుగా ‘ఎక్స్’ (Twitter)లో పలు ఖాతాలు ఒకే తరహా సందేశాలను ప్రచారం చేస్తున్నాయి. వాటిలో “భారత సైన్యం ఆధునిక ఆయుధాలను కొనుగోలు చేయాలని కోరుతుండగా, ప్రభుత్వం ఆమోదం ఇవ్వకపోవడం వల్ల ఆర్మీ చీఫ్ అసంతృప్తిగా ఉన్నారు” అంటూ వదంతులు వ్యాప్తి చెందుతున్నాయి. ఈ పోస్టులు ఎక్కువగా పాకిస్థాన్ నుంచే షేర్ అవుతున్నట్లు అధికారులు గుర్తించారు. దేశ నాయకత్వం, సైన్యం మధ్య ఐక్యతను దెబ్బతీయాలనే ఉద్దేశ్యంతోనే ఈ కల్పిత ప్రచారం జరుగుతోందని పీఐబీ ఫ్యాక్ట్ చెక్ స్పష్టంచేసింది.
గతంలోనూ ఇలాంటివే కుట్రలు
ఈ విధమైన ప్రచారం పాకిస్థాన్ తరచూ చేస్తోందని అధికారులు గుర్తు చేశారు. గతంలో కూడా ‘ఆపరేషన్ సిందూర్’(Operation Sindoor) సమయంలో ఇదే తరహా అసత్య ప్రచారాలు సోషల్ మీడియాలో విస్తరించాయని, వాటిని కూడా అప్పుడు ఖండించాల్సి వచ్చిందని పేర్కొన్నారు. ప్రజల్లో అపనమ్మకాలు పెంచి దేశ భద్రతను దెబ్బతీయడమే పాకిస్థాన్ ఉద్దేశమని తెలిపారు.
పీఐబీ హెచ్చరిక
“ఇలాంటి నిరాధార వార్తలను నమ్మవద్దు. ఏదైనా సమాచారం నిజమో కాదో తెలుసుకోవాలంటే అధికారిక ప్రభుత్వ వనరులను మాత్రమే ఆశ్రయించండి” అని పీఐబీ ఫ్యాక్ట్ చెక్ విభాగం పౌరులకు సూచించింది. దేశ భద్రతకు సంబంధించిన విషయాల్లో అప్రమత్తంగా ఉండాలని, సోషల్ మీడియాలో వస్తున్న ప్రతి సమాచారం నమ్మదగినదని భావించకూడదని హెచ్చరించింది. దేశంపై కుట్రలు, తప్పుడు ప్రచారాలు ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉంటాయని, కానీ ప్రజలు వాటికి బలికావద్దని అధికారులు కోరుతున్నారు. ప్రత్యేకంగా పాకిస్థాన్ నుంచి వచ్చే ఫేక్ న్యూస్ దేశీయ ఐక్యతను దెబ్బతీయాలనే ఉద్దేశంతోనే వ్యాప్తి చెందుతుందని చెబుతున్నారు. కాబట్టి పౌరులు జాగ్రత్తగా ఉండి, ఎటువంటి వదంతులను పంచుకోకుండా ఆపేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
Read hindi news:hindi.vaartha.com
Read also: