భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ(Nehru)పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(Narendra Modi) మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. సింధు నదీ జలాల(Sindu River Water) ఒప్పందం విషయంలో నెహ్రూ చారిత్రక తప్పిదానికి పాల్పడ్డారని, తద్వారా దేశ రైతాంగానికి తీరని అన్యాయం చేశారని ఆరోపించారు. మంగళవారం జరిగిన ఎన్డీఏ పార్లమెంటరీ సమావేశంలో ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ లైబ్రరీ భవనంలో జరిగిన ఈ సమావేశంలో మోదీ మాట్లాడుతూ, “నెహ్రూ దేశాన్ని ఒకసారి కాదు, రెండుసార్లు విభజించారు. మొదట రాడ్క్లిఫ్ లైన్తో, ఆ తర్వాత సింధు జలాల ఒప్పందంతో దేశానికి నష్టం చేకూర్చారు” అని వ్యాఖ్యానించారు. ఈ ఒప్పందం కింద సింధు నది జలాల్లో 80 శాతం నీటిని పాకిస్థాన్కు ధారాదత్తం చేశారని ఆయన మండిపడ్డారు. ఆ తర్వాత తన కార్యదర్శి వద్ద ఈ ఒప్పందం వల్ల ఎలాంటి ప్రయోజనం కలగలేదని నెహ్రూ స్వయంగా తన తప్పును అంగీకరించారని మోదీ తెలిపారు. ఈ ఒప్పందం పూర్తిగా రైతు వ్యతిరేకమని ఆయన అభివర్ణించారు.
నెహ్రూ హయాంలో రాజ్యాంగ సవరణ
రాజ్యాంగం కల్పించిన వాక్ స్వాతంత్ర్యపు హక్కును కాలరాసేందుకు నెహ్రూ హయాంలో రాజ్యాంగ సవరణ చేశారని మోదీ మండిపడ్డారు. ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా నియోజకవర్గాల సంఖ్యను పెంచారని విమర్శించారు. వెనుకబడిన వర్గాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడూ కృషి చేయలేదని, తమ ప్రభుత్వం వచ్చాకే వారి అభివృద్ధి మొదలైందని అన్నారు. ఎన్డీయే హయాంలో దేశం మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగే దిశగా అడుగులు వేస్తోందని అన్నారు.
ఓట్ల దొంగతనం ఆరోపణలపై ఎందుకు మౌనంగా ఉన్నారు?: ప్రియాంక
ప్రధాని మోదీ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ తీవ్రంగా స్పందించారు. 11 ఏళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం, తమ బాధ్యతల నుంచి తప్పించుకోవడానికే పదేపదే నెహ్రూను నిందిస్తోందని ఆమె విమర్శించారు. “గతాన్ని పదేపదే తవ్వడం మానేసి, వర్తమానంలో జరుగుతున్న విషయాలపై సమాధానం చెప్పాలి. ఓట్ల దొంగతనం ఆరోపణలపై ఎందుకు మౌనంగా ఉన్నారు? ప్రజలకు జవాబుదారీగా ఉండాలి” అని పార్లమెంట్ వెలుపల మీడియాతో మాట్లాడుతూ ప్రియాంక డిమాండ్ చేశారు.
సింధు జలాల ఒప్పందం అంటే ఏమిటి?
సింధు జలాల ఒప్పందం ( IWT ) అనేది సింధు నది మరియు దాని ఉపనదులలో లభ్యమయ్యే నీటిని ఉపయోగించుకోవడానికి ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వంతో భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య నీటి-పంపిణీ ఒప్పందం. ఇది కరాచీలో 19 సెప్టెంబర్ 1960న భారత ప్రధాన మంత్రి జవహర్లాల్ నెహ్రూ మరియు పాకిస్తానీ అధ్యక్షుడు అయూబ్ ఖాన్ చేత సంతకం చేయబడింది.
సింధు నదుల మూలం ఎక్కడ ఉంది?
గంగా మరియు సింధు నదుల మూలాలు హిమాలయాలలో ఉన్నాయి. గంగా నది గంగోత్రి హిమానీనదం నుండి ప్రవహిస్తుంది మరియు సింధు నది టిబెట్ నుండి మానస సరోవరం సరస్సు సమీపంలో ప్రవహిస్తుంది.
Read hindi news: hindi.vaartha.com
Read also: