యుద్ధ సన్నద్ధతపై కేంద్ర హోంశాఖ కీలక సమీక్ష నిర్వహించింది. హోంశాఖ కార్యదర్శి గోవింద్మోహన్ నేతృత్వంలో ఈ సమీక్ష చేసింది. సుమారు 244 జిల్లాల్లో మాక్డ్రిల్స్కు సంబంధించిన ఏర్పాట్లపై అధికారులు సమీక్షిస్తున్నారు. ఈ మేరకు సమీక్షకు సివిల్ డిఫెన్స్ డీజీ, ఎన్డీఆర్ఎఫ్ డీజీ సహా పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. బుధవారం అన్ని రాష్ట్రాల్లో సివిల్ మాక్డ్రిల్స్ చేయాలని నిన్న కేంద్రం ఆదేశించింది. కాగా, తాము సన్నద్ధతను సమీక్షించామని సమావేశం అనంతరం జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ సభ్యులు ఒకరు చెప్పారు.
మూడు కేటగిరీలుగా మాక్ డ్రిల్స్
బుధవారం మాక్డ్రిల్స్ నిర్వహించే ప్రాంతాలను 3 కేటగిరీలుగా విభజించారు. మొదటి కేటగిరీలో దిల్లీ, ముంబయి, సూరత్, వడోదర, కక్రాపూర్, తారాపూర్, తాల్చేర్, కోట, రావత్, చెన్నై, కల్పక్కం, నరోరా జిల్లాలు ఉన్నాయి. రెండో జాబితాలో హైదరాబాద్, విశాఖపట్నం సహా 201 జిల్లాలు ఉన్నాయి. మూడో జాబితాలో 45 జిల్లాలు ఉన్నాయి. ఇక పాకిస్థాన్తో సరిహద్దు ఉన్న రాష్ట్రాలు గుజరాత్, పంజాబ్, హరియాణా, జమ్ముకశ్మీర్కు ప్రత్యేక సూచనలు జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం.
పౌరులకు ఎలా కాపాడుకోవాలో ట్రైనింగ్
పాకిస్థాన్పై భారత్ ప్రతీకార దాడులు చేయవచ్చనే అంచనాలు నెలకొన్న తరుణంలో కేంద్ర హోంశాఖ రాష్ట్రాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. పాక్ కూడా ప్రతిదాడికి దిగితే అందుకు ముందుగానే రాష్ట్రాలను సిద్ధం చేస్తోంది. సమాచార మంత్రిత్వ శాఖ వివరాల ప్రకారం, ఎయిర్-రెయిడ్ హెచ్చరిక సైరెన్ల గురించి, ప్రతికూల పరిస్థితుల్లో పౌరులకు వారిని వారు ఎలా కాపాడుకోవాలో ట్రైనింగ్ ఇవ్వడం, బంకర్లు- ట్రెంచ్లను శుభ్రం చేసుకునే సన్నద్ధతపై మాక్ డ్రిల్స్ ఉంటాయి. అంతేకాకుండా క్రాష్ బ్లాకౌట్స్, కీలకమైన ప్లాంట్లు, ఇన్స్టాలేషన్ల వద్ద ముందస్తుగా శత్రువులకు దొరకకుండా జాగ్రత్త పడటం, అత్యవసర సమయంలో మనుషులను తరలించే ప్రణాళికలు గురించి ఈ డ్రిల్స్ ఉంటాయి.ఇక, సైన్యం పరంగా మాక్ డ్రిల్స్లో భాగంగా భారత వైమానిక దళం(ఐఏఎఫ్)తో హాట్లైన్, రేడియో-కమ్యూనికేషన్ లింక్ల కార్యాచరణ, కంట్రోల్ రూమ్లు, షాడో కంట్రోల్ రూమ్ల సంసిద్ధతను పరీక్షిస్తారు.
విద్యార్థులకు అవకాశం
మే 7న దేశంలోని 244 జిల్లాలో రిహార్సల్ నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. గ్రామ స్థాయి నుంచి ఈ మాక్ డ్రిల్స్ చేపట్టాలని ఆదేశించింది.ఈ కార్యక్రమంలో జిల్లా కంట్రోలర్లు, వివిధ జిల్లా అధికారులు, పౌర రక్షణ వార్డెన్లు, వలంటీర్లు, హోమ్ గార్డ్లు (యాక్టివ్, రిజర్విస్ట్ వలంటీర్లు), నేషనల్ క్యాడెట్ కార్ప్స్ (NCC), నేషనల్ సర్వీస్ స్కీమ్ (NSS) వలంటీర్లు, నెహ్రూ యువ కేంద్ర సంఘటన్ (NYKS), కళాశాల, పాఠశాల విద్యార్థులు చురుకుగా పాల్గొనాలని చేయాలని యోచిస్తున్నట్లు పేర్కొంది.
Read Also : Pakistan: పాక్, బంగ్లా సరిహద్దుల్లో బీఎస్ఎఫ్ మరింత భద్రతకు కేంద్రం కసరత్తు