ప్రపంచ సినీ పరిశ్రమ దృష్టిని ఆకర్షించిన టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం ‘SSMB 29’. ఈ సినిమా ఎప్పటి నుంచో అభిమానుల్లో భారీ అంచనాలు రేపుతోంది. రాజమౌళి తన ప్రత్యేకమైన విజువల్స్, కథనశైలి, అంతర్జాతీయ ప్రమాణాలతో సినిమాలు తెరకెక్కిస్తారని తెలిసిన విషయమే. బాహుబలి, ఆర్ఆర్ఆర్లాంటి పాన్ ఇండియా బ్లాక్బస్టర్ల తర్వాత మహేష్తో చేస్తున్న ఈ ప్రాజెక్టుపై అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి.
ఇక ఈ చిత్రానికి సంబంధించి తాజాగా ఒక కీలకమైన సమాచారం బయటకు వచ్చింది. అది కూడా ఎవరో కాదు, కెన్యా విదేశాంగ శాఖ మంత్రి ముసాలియా ముదావడి స్వయంగా వెల్లడించారు. ఆయన సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫొటోలు ఇప్పుడు సినీ ప్రపంచంలో చర్చనీయాంశంగా మారాయి. రాజమౌళి, ఆయన కుమారుడు కార్తికేయతో పాటు ఇతర ప్రతినిధులతో సమావేశమైన ఫొటోలు ఆయన ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా కీలక విషయాన్ని ప్రకటించారు.
కెన్యా షెడ్యూల్ పూర్తయింది
‘SSMB 29’ చిత్ర బృందం కెన్యాలో షూటింగ్ షెడ్యూల్ జరిపిందని, ఆ షెడ్యూల్ విజయవంతంగా పూర్తయిందని మంత్రి ముదావడి తెలిపారు. గత రెండు వారాలుగా కెన్యా వేదికగా నిలిచిన ఈ భారీ చిత్ర బృందం ఇప్పుడు భారత్కు తిరుగు ప్రయాణం అయినట్లు ఆయన స్పష్టంచేశారు. ఈ సందర్భంగా రాజమౌళి (Rajamouli) ప్రతిభపై ప్రశంసల వర్షం కురిపించారు.ఆసియాలోనే అతిపెద్ద చిత్ర నిర్మాణ సంస్థ తమ దేశంలో షూటింగ్ జరుపుకోవడం గర్వకారణమని ఆయన పేర్కొన్నారు.
సినిమాకు సంబంధించిన ఆసక్తికర వివరాలను కూడా మంత్రి పంచుకున్నారు. తూర్పు ఆఫ్రికాలోని పలు దేశాల్లో లొకేషన్ల కోసం వెతికిన తర్వాత, రాజమౌళి బృందం కెన్యాను ప్రధాన షూటింగ్ ప్రదేశంగా ఎంచుకుందని ఆయన తెలిపారు. సినిమాలోని ఆఫ్రికా సన్నివేశాల్లో దాదాపు 95 శాతం చిత్రీకరణ తమ దేశంలోనే జరిగిందని స్పష్టం చేశారు. మసాయ్ మారా, నైవాషా, సంబురు, అంబోసెలీ వంటి సుందరమైన ప్రదేశాల్లో కీలక సన్నివేశాలను చిత్రీకరించినట్లు వివరించారు.
ప్రపంచానికి చాటిచెప్పే గొప్ప అవకాశమని
ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 120కి పైగా దేశాల్లో విడుదల కానుందని మంత్రి ముదావడి వెల్లడించారు. ఇది సినిమా చరిత్రలోనే ఒక మైలురాయిగా నిలుస్తుందని, తమ దేశ సౌందర్యాన్ని, ఆతిథ్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పే గొప్ప అవకాశమని ఆయన అన్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న చిత్ర బృందం భారత్కు బయలుదేరినట్లు తెలుపుతూ, ఈ సినిమా ద్వారా కెన్యా కథ ప్రపంచానికి తెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ భారీ బడ్జెట్ చిత్రంలో మహేశ్ బాబు సరసన ప్రియాంక చోప్రా నటిస్తుండగా, పృథ్వీరాజ్ సుకుమారన్ ఒక ముఖ్య పాత్రలో కనిపించనున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Read also: