ప్రముఖ ట్రావెల్ యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా పాకిస్థాన్కు గూఢచర్యం చేసిన ఆరోపణలపై అరెస్టయిన విషయం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ కేసులో తాజాగా వెలుగులోకి వచ్చిన వివరాలు ఆమె పాకిస్థాన్లో ఉన్నత స్థాయి సంబంధాలు, ఆతిథ్యం, భద్రతా ఏర్పాట్లపై దృష్టి సారించాయి.
పాకిస్థాన్లో జ్యోతికి ప్రత్యేక ఆతిథ్యం
జ్యోతి మల్హోత్రా పాకిస్థాన్ పర్యటనలో ఆమెకు రాచమర్యాదలు జరిగినట్లు తెలుస్తోంది. లాహోర్ లోని అనార్కలీ బజార్ సందర్శించిన సమయంలో జ్యోతి మల్హోత్రాకు ఏకంగా ఆరుగురు గన్ మెన్లు ఏకే 47 లతో భద్రత కల్పించిన విషయం బయటపడింది. స్కాట్లాండ్ కు చెందిన ఓ యూట్యూబర్ వీడియోలో జ్యోతి మల్హోత్రా గన్ మెన్ల భద్రత మధ్య వీడియోలు తీసుకోవడం కనిపించింది. జ్యోతి మల్హోత్రాకు కల్పించిన సెక్యూరిటీపై స్కాట్లాండ్ యూట్యూబర్ ఆశ్చర్యపోయారు.
కాలమ్ మిల్ వీడియోలో వెలుగులోకి వచ్చిన కీలక అంశాలు
కాలమ్ మిల్ లాహోర్ బజార్లో షాపింగ్ చేస్తుండగా యూట్యూబర్ స్కాటిష్ పౌరుడు కాలమ్ మిల్ గత మార్చి నెలలో పాకిస్థాన్లో పర్యటించారు. లాహోర్లోని ప్రసిద్ధ అనార్కలీ బజార్లో ఆయన తిరుగుతుండగా, కొందరు వ్యక్తులు తుపాకులతో కనిపించారు. వారి చొక్కాలపై “నో ఫియర్” అని రాసి ఉంది. వారితో పాటు జ్యోతి మల్హోత్రా కూడా వీడియో రికార్డ్ చేస్తూ కనిపించింది. కాలమ్ మిల్ తనను తాను పరిచయం చేసుకుని, పాకిస్థాన్కు రావడం ఇది ఐదోసారని చెప్పింది. జ్యోతి తాను భారతీయురాలినని పరిచయం చేసుకుంది. పాక్ ఆతిథ్యం గురించి కాలమ్ అడగగా “చాలా బాగుంది” అని జ్యోతి బదులిచ్చింది. ఆమె చుట్టూ ఆరుగురు గన్మెన్లు ఉన్నారు. అన్ని తుపాకులు ఎందుకు? అంత భద్రత అవసరమేంటి? అని ఆయన తన వీడియోలో ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కాలమ్ మిల్ ఒంటరిగా తిరుగుతుంటే, జ్యోతి మల్హోత్రాకు ఇంత భారీ భద్రత ఎందుకన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఆ సాయుధులు యూనిఫాంలో లేనప్పటికీ మఫ్తీలో ఉన్న భద్రతా సిబ్బంది అయి ఉండొచ్చని భావిస్తున్నారు.
జ్యోతి మల్హోత్రా & ISI లింకులు?
జ్యోతి మల్హోత్రా 2023లో ఢిల్లీలోని పాకిస్థాన్ హైకమిషన్ను సందర్శించినప్పుడు, అక్కడ “దానిష్” అనే పేరుతో ఉన్న ఒక ఐఎస్ఐ (ISI) ఏజెంట్ను కలిసినట్లు విచారణలో వెల్లడైంది. ఆమె పాకిస్థాన్కు అనేక సార్లు ప్రయాణించి, అక్కడి ఏజెంట్లతో సంబంధాలను కొనసాగించినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఆర్థిక లావాదేవీలు – ఆదాయానికి మించిన జీవితం
జ్యోతి ఆర్థిక లావాదేవీలపైనా పోలీసులు దృష్టి సారించారు. ఆమె ఆదాయానికి మించి విలాసవంతమైన జీవితం గడిపినట్లు గుర్తించారు. విమానాల్లో ఎప్పుడూ ఫస్ట్ క్లాస్లోనే ప్రయాణించడం, ఖరీదైన హోటళ్లలో బస చేయడం వంటివి చేసినట్లు తేలింది. ఆమె పాకిస్థాన్ పర్యటన స్పాన్సర్డ్ ట్రిప్ అయి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. పాకిస్థాన్ నుంచి వీఐపీ ఆతిథ్యం పొంది తిరిగివచ్చిన వెంటనే జ్యోతి చైనాకు వెళ్లారు. అక్కడ కూడా విలాసవంతమైన కార్లలో తిరుగుతూ, ఖరీదైన నగల దుకాణాలను సందర్శించినట్లు సమాచారం. జ్యోతి ఉపయోగించిన మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్, కెమెరాలు, డ్రోన్ పరికరాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ పరికరాల డేటా ద్వారా, ఆమె ఎవరెవరి తో మాట్లాడింది? ఎక్కడెక్కడ వీడియోలు తీసింది? వాటి మ్యాప్ లొకేషన్, నెట్వర్క్ లాగ్స్ వంటి అంశాలను విచారిస్తున్నారు.