ఇటీవల భారత భద్రతా వ్యవస్థను దెబ్బతీసే విధంగా పాకిస్థాన్ నిఘా సంస్థలకు దేశానికి సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని చేరవేస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో అరెస్టయిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా కేసు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. సాధారణంగా దేశీయ యూట్యూబర్గా పర్యాటక వీడియోల ద్వారా గుర్తింపు పొందిన ఆమె, సమాచారాన్ని పాకిస్థాన్ నిఘా సంస్థలకు చేరవేస్తున్నారన్న ఆరోపణలపై మల్హోత్రా కేసు విచారణలో కీలక విషయాలు వెలుగుచూస్తున్నాయి. గతంలో పూరీ జగన్నాథ ఆలయంతో పాటు ఉజ్జయినిలోని మహాకాళేశ్వర్ ఆలయాన్ని కూడా సందర్శించినట్లు అధికారులు గుర్తించారు. ముఖ్యంగా, పూరీ ఆలయంపై డ్రోన్ ఎగరవేయడం ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతోంది.
పూరీ జగన్నాథ ఆలయంలో డ్రోన్ కలకలం
జ్యోతి మల్హోత్రా పూరీ జగన్నాథ ఆలయాన్ని సందర్శించారు. ఆ సమయంలో ఆమె ఆలయ పరిసరాల్లో డ్రోన్ను ఎగురవేసినట్లు అధికారులు గుర్తించారు. శ్రీక్షేత్రంపై ఉగ్రవాదుల దృష్టి ఉందంటూ ఇటీవల కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ఈ విషయం వెలుగులోకి రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆలయంపైకి డ్రోన్ను ఎందుకు పంపారు, దాని ద్వారా ఎలాంటి దృశ్యాలను చిత్రీకరించారు అనే కోణంలో అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
ఉజ్జయిని మహాకాళేశ్వర్ ఆలయ సందర్శనపై దర్యాప్తు
జ్యోతి మల్హోత్రా గత ఏడాది ఏప్రిల్ నెలలో ఉజ్జయిని మహాకాళేశ్వర్ ఆలయాన్ని కూడా సందర్శించినట్టు మధ్యప్రదేశ్ పోలీసులు ధృవీకరించారు. అయితే, అక్కడి విచారణలో ఇప్పటివరకు ఎలాంటి నేరారోపణలు నిర్ధారణ కాలేదని, ఆమె ఏయే ప్రాంతాలకు వెళ్లింది, ఎక్కడ బస చేసింది అనే అంశాలపై దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు పేర్కొన్నారు. జ్యోతి మల్హోత్రా పర్యాటక యూట్యూబర్గా దేశంలోని పలు ప్రదేశాలకు వెళ్లి వీడియోలు చేయడాన్ని నిఘా సంస్థలు ఇప్పుడు శంకతో చూస్తున్నాయి.
Read also: Schizophrenia: ఆందోళన కలిగిస్తున్న స్కిజోఫ్రీనియా రుగ్మత