అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తన కుటుంబంతో కలిసి భారత్ పర్యటన రాబోతున్న సమయంలో విదేశీ విద్యార్థుల వీసాల రద్దు అంశం కీలకంగా మారింది. అమెరికాలో భారత విద్యార్థుల వీసాలను సరైన కారణం లేకుండా రద్దు చేయడం తీవ్ర విమర్శలకు దారితీసింది. ఈ అంశాన్ని జేడీ వాన్స్తో చర్చించే అవకాశాన్ని కేంద్ర ప్రభుత్వం ఉపయోగించనుంది. ఇప్పటికే 327 మంది విదేశీ విద్యార్థుల వీసాలు రద్దయ్యాయని, అందులో సగం మంది భారతీయులేనని రాజకీయ ప్రముఖులు తెలిపారు.
మొదటి రోజు ఢిల్లీలో అక్షర్ధామ్ ఆలయాన్ని సందర్శించనున్నారు
జేడీ వాన్స్ పర్యటన షెడ్యూల్ ప్రకారం.. ఆయన ఈ నెల 24 వరకు భారతదేశంలో పర్యటించనున్నారు. మొదటి రోజు ఢిల్లీలో అక్షర్ధామ్ ఆలయం, చేనేత ఉత్పత్తుల కేంద్రాన్ని సందర్శించనున్నారు. అనంతరం ప్రధాని మోదీతో సమావేశమై ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు జరగనున్నాయి. ఆయనకు ప్రధాని మోదీ ప్రత్యేక విందు ఇవ్వనున్నారు. తరువాతి రోజుల్లో జైపూర్, ఆగ్రా వంటి చారిత్రక ప్రదేశాలను సందర్శించనున్నారు. ఈ పర్యటనలో ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాలు, విద్య, వీసా సమస్యలపై చర్చలు జరగనున్నాయి.
వీసాలు రద్దు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు
విద్యార్థుల భవిష్యత్తును హానికరంగా ప్రభావితం చేసే విధంగా వీసాలు రద్దు చేయడాన్ని విదేశీ వ్యవహార నిపుణులు తీవ్రంగా ఖండిస్తున్నారు. అమెరికా ప్రభుత్వం తగిన కారణాలే లేకుండా వీసాలు రద్దు చేస్తుండటాన్ని ప్రశ్నిస్తూ న్యాయపరంగా చర్యలు తీసుకుంటున్నారు. భారత ప్రభుత్వం ఈ సమస్యపై అమెరికా ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నించాలన్న డిమాండ్లు పెరుగుతున్నాయి. వాన్స్ పర్యటనతో భారత్కు ఈ సమస్యపై స్పష్టత కోరే అవకాశంగా మారినట్టు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.