భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ మరోసారి పాకిస్థాన్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నెదర్లాండ్స్కు చెందిన ప్రముఖ మీడియా సంస్థలకు ఇచ్చిన ఇంటర్వ్యూలలో ఆయన, పాకిస్థాన్ భూమిపై ఉగ్రవాదులు స్వేచ్ఛగా తిరుగుతున్న వాస్తవాన్ని బయటపెట్టారు. ఉగ్రవాద కార్యకలాపాలపై పాక్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, కొన్నిసార్లు నాటకీయంగా అవగాహన లేదంటూ తప్పించుకుంటోందని ఆరోపించారు. ఉగ్రవాద కార్యకలాపాల గురించి తమకు తెలియదని పాకిస్థాన్ చెప్పడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. పాకిస్థాన్ ప్రభుత్వం, ఆ దేశ సైన్యం రెండూ ఉగ్రవాద కార్యకలాపాల్లో పూర్తిగా నిమగ్నమై ఉన్నాయని ఆయన ఆరోపించారు.

ఐక్యరాజ్యసమితి ఆంక్షలు ఉన్నా.. పాక్గడ్డపై కరడుగట్టిన ఉగ్రవాదులు
జైశంకర్ వెల్లడించిన కీలక అంశం ఏమిటంటే, ఐక్యరాజ్యసమితి ఆంక్షల జాబితాలో ఉన్న కరడుగట్టిన ఉగ్రవాదులంతా పాకిస్థాన్లోనే ఆశ్రయం పొందుతున్నారు. ఆ దేశంలోని పెద్ద నగరాల్లోనే వారు పగటిపూట కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. వారు ఎక్కడ ఉంటారో, ఎలాంటి చర్యలకు పాల్పడుతున్నారో, వారి మధ్య సంబంధాలు ఏమిటో అన్నీ మాకు తెలుసు అని జైశంకర్ గట్టిగా వ్యాఖ్యానించారు.
పహల్గామ్ దాడిలో పాకిస్థాన్ ప్రమేయం
జమ్మూకశ్మీర్లో ఇటీవల జరిగిన పహల్గామ్ ఉగ్రదాడిని ప్రస్తావించిన జైశంకర్ ఈ ఘటనలో తమ ప్రమేయం లేదని పాకిస్థాన్ నటించకూడదు. పాక్ ప్రభుత్వం ఉగ్రవాద సంస్థలకు అన్ని విధాలా సహకారం అందిస్తోంది. ముఖ్యంగా పాక్ సైన్యం సరిహద్దు ఉగ్రవాదంలో పూర్తిగా కూరుకుపోయింది అని ఆయన ధ్వజమెత్తారు. ఉగ్రవాదం, కశ్మీర్ అంశాలను భారత్ వేర్వేరుగా పరిగణిస్తుందని ఆయన స్పష్టం చేశారు. విదేశాంగ మంత్రి జైశంకర్ చేసిన వ్యాఖ్యలు పాకిస్థాన్ నిజ స్వరూపాన్ని ప్రపంచానికి మరోసారి బయటపెట్టాయి. ఉగ్రవాదం వృద్ధికి పాక్ సైన్యం, ప్రభుత్వం తోడ్పడుతున్నదనే అభిప్రాయం స్పష్టంగా వెల్లడయ్యింది.
Read also: Indus Water Treaty : సింధు జలాల నీటిని అడ్డుకుంటే.. భారత ప్రజల ఊపిరి తీస్తాం :పాక్ ఆర్మీ