2025 జనవరి నెల నుంచి ఇప్పటి వరకు దాదాపు 1,100 మంది భారతీయులు అమెరికా నుంచి బహిష్కరణకు గురయ్యారు అని విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) అధికార ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ (Randhir Jaiswal) మీడియాతో వెల్లడించారు. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తిరిగి పదవిలోకి వచ్చిన అనంతరం వలస సంబంధిత నియమ నిబంధనల అమలులో కఠినత్వం మరింతగా పెరిగింది. ఈ నేపథ్యంలో భారతీయులపై ప్రభావం పడినట్లు సమాచారం.
వాణిజ్య విమానాల ద్వారా పంపింపు:
ఈ బహిష్కరణలలో సుమారు 62 శాతం మంది వాణిజ్య విమానాల ద్వారా భారత్కు తిరిగి చేరారు. అక్రమ వలసలకు సంబంధించి రెండు దేశాల మధ్య సన్నిహిత సహకారం కొనసాగుతుందని, అందుకే అక్రమ మార్గాల్లో అమెరికాలో ప్రవేశించిన వారిని మన దేశం వెనక్కి రప్పిస్తుందని ఆయన వివరించారు.
అక్రమ వలసలపై అమెరికా-భారత్ మధ్య సహకారం:
అక్రమ వలసలపై రెండు దేశాల మధ్య కొనసాగుతున్న సహకారాన్ని రణధీర్ జైశ్వాల్ హైలైట్ చేశారు. వలస సమస్యపై భారత్, అమెరికా మధ్య మంచి సన్నిహిత సహకారం ఉంది. అక్కడ అక్రమ హోదా కలిగి ఉన్న, చట్టవిరుద్ధంగా అక్కడికి ప్రయాణించిన భారతీయ పౌరులను బహిష్కరించే విషయంలో వారి గురించి పూర్తి వివరాలు అందిన తర్వాత అన్ని విషయాలు ధ్రువీకరించుకున్నాక మేము వారిని తిరిగి స్వదేశానికి రప్పిస్తున్నాం. మేము ఇంతకు ముందు మీకు చెప్పినట్లుగా వారి జాతీయతలను మేము ధృవీకరిస్తాం. ఆ తర్వాత మాత్రమే వారిని తిరిగి ఇండియాకు తీసుకురావడానికి ప్రయత్నిస్తాం అని ఆయన అన్నారు.
ఇరాన్లో ముగ్గురు భారతీయుల గురించి తెలియకపోవడం:
ఈ సందర్భంగా రణధీర్ జైశ్వాల్ మరో కీలక అంశాన్ని కూడా ప్రస్తావించారు. ప్రస్తుతం ఇరాన్లో ముగ్గురు భారతీయ పౌరులు తప్పిపోయిన ఘటనపై, భారత ప్రభుత్వం సీరియస్గా స్పందిస్తోంది. ఇరాన్ అధికారులతో సంప్రదింపులు జరుపుతోందని రణధీర్ జైశ్వాల్ తెలిపారు. ఇరాన్ వైపు నుంచి కూడా మంచి సహకారం లభిస్తోందని విలేకరుల సమావేశంలో తెలిపారు. తప్పిపోయిన ముగ్గురు వ్యక్తుల కుటుంబ సభ్యులకు మంత్రిత్వ శాఖ అన్ని విధాలుగా సహాయం అందిస్తోందని చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా వలస సమస్యలు, అక్రమ వలసల నియంత్రణ అంశాలు ఇప్పుడు ప్రధాన చర్చాంశంగా మారాయి. ముఖ్యంగా అమెరికాలో వలసదారుల సంఖ్య పెరిగిన నేపథ్యంలో, అక్కడి ప్రభుత్వం నియమాలను కఠినతరం చేయడమే కాకుండా, విదేశీ పౌరులను తిరిగి పంపించడంపై దృష్టి పెడుతోంది.
Read also: India: ఆర్థికంగా చైనా కన్నా భారత్ ఎక్కువగా బలపడాలి అంటే..