ఎలక్ట్రిక్ వాహనాలు, స్వచ్ఛ శక్తి వ్యవస్థలు, అత్యాధునిక ఎలక్ట్రానిక్ పరికరాలు ఈ రంగాలన్నింటికీ మూలాధారం ఒకటే. అదే రేర్ ఎర్త్ మినరల్స్(Rare Earth Minerals). ఈ కీలక ఖనిజాల సరఫరాలో ఇప్పటివరకు ప్రపంచాన్ని శాసించిన దేశం చైనా. అయితే ఆ ఆధిపత్యాన్ని తగ్గించి, భారత్ను స్వయం సమృద్ధిగా మార్చే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశీయంగా రేర్ ఎర్త్ మినరల్స్ ఆధారంగా తయారయ్యే శక్తివంతమైన అయస్కాంతాల ఉత్పత్తిని పెంచేందుకు రూ.7,280 కోట్ల భారీ ప్రోత్సాహక పథకానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
Read also: Ethiopia: ప్రధాని మోదీకి అరుదైన గౌరవం
రేర్ ఎర్త్ మినరల్స్ ఎందుకు అంత కీలకం?
ఈ ఖనిజాలు భూమిలో దొరకవు అనే భావన చాలామందిలో ఉన్నా, నిజానికి సమస్య వాటి లభ్యత కాదు. వాటిని వెలికితీసి, శుద్ధి చేసి, వినియోగానికి తగిన మెటీరియల్గా మార్చడమే అసలైన సవాల్. ముఖ్యంగా ఎలక్ట్రిక్ కార్ల మోటార్లు, విండ్ టర్బైన్లు, జెట్ ఇంజిన్లు, మొబైల్ ఫోన్లు, లాప్టాప్లలో ఉపయోగించే నియోడైమియం ఆధారిత శాశ్వత అయస్కాంతాలు (NdFeB Magnets) తయారీలో ఈ ఖనిజాలు కీలక పాత్ర పోషిస్తాయి. ఇప్పటివరకు భారత్ ఈ విభాగంలో చైనా దిగుమతులపై ఎక్కువగా ఆధారపడుతోంది.
కేంద్ర ప్రభుత్వ ప్రణాళిక ఏంటి?
భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ప్రకటన ప్రకారం, ఈ పథకం ద్వారా దేశంలోనే అధునాతన మేగ్నెట్ల తయారీకి ఊతమివ్వనున్నారు. ఏడాదికి సుమారు 6,000 మెట్రిక్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యాన్ని సాధించడమే లక్ష్యం. అంతర్జాతీయ టెండర్ల ద్వారా ఐదు కంపెనీలను ఎంపిక చేసి, వాటికి రెండు రకాల ప్రోత్సాహకాలు అందిస్తారు. ఒకటి ప్లాంట్ నిర్మాణానికి కాపిటల్ సపోర్ట్, రెండోది ఉత్పత్తి అమ్మకాలపై ఆధారపడి ఇచ్చే ప్రోత్సాహక రాయితీలు.
ఖనిజాలు ఉన్నా మనం ఎందుకు వెనుకబడ్డాం?
భారత్కు ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉన్న రేర్ ఎర్త్ ఖనిజ నిల్వలు ఉన్నాయి. ముఖ్యంగా తీర ప్రాంతాల్లో వీటి లభ్యత ఎక్కువ. కానీ, సమస్య మైనింగ్లో కాదు. వాటిని హై-గ్రేడ్ లోహాలుగా, ఆపై అత్యాధునిక మేగ్నెట్లుగా మార్చే ప్రాసెసింగ్ టెక్నాలజీలో మనం ఇప్పటివరకు వెనుకబడ్డాం. ఈ లోటును పూడ్చడమే ఈ పథక ప్రధాన ఉద్దేశ్యం.
ప్రాజెక్ట్ టైమ్లైన్ & లాభాలు
ఈ ప్రణాళికకు మొత్తం 7 సంవత్సరాల గడువు నిర్ణయించారు. మొదటి రెండు సంవత్సరాలు ఫ్యాక్టరీల నిర్మాణానికి, మిగిలిన ఐదు సంవత్సరాలు ఉత్పత్తికి కేటాయిస్తారు. నిర్ణీత సమయానికి ముందే తయారీ ప్రారంభిస్తే అదనపు ప్రోత్సాహకాలు అందిస్తామని కేంద్రం స్పష్టం చేసింది. అటామిక్ ఎనర్జీ విభాగానికి చెందిన IREL (India) Limited ఈ యూనిట్లకు అవసరమైన ముడి ఖనిజాలను సరఫరా చేస్తుంది.
ఈ ప్రాజెక్ట్ అమలుతో భవిష్యత్తులో ఎలక్ట్రిక్ వాహనాల ఖర్చులు తగ్గడమే కాకుండా, రక్షణ, అంతరిక్ష, స్వచ్ఛ శక్తి రంగాల్లో భారత్ స్వయం సమృద్ధి దిశగా అడుగులు వేస్తుంది. చైనా ఆధిపత్యానికి సవాల్ విసురుతూ, రేర్ ఎర్త్ మేగ్నెట్ల రంగంలో భారత్ ప్రపంచ స్థాయిలో కీలక పాత్ర పోషించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: