ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లే భారతీయ విద్యార్థుల సంఖ్య (Number of Indian students going to America) ఈసారి గణనీయంగా తగ్గింది. దీనికి ప్రధాన కారణం ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న కఠిన వీసా (Visa) విధానాలేనని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. హైదరాబాద్లోని విద్యా సలహాదారుల మాటల ప్రకారం, అమెరికా వెళ్లే స్టూడెంట్ల సంఖ్యలో 70 శాతం వరకు పడిపోయింది.ప్రస్తుతం వీసా అపాయింట్మెంట్ స్లాట్లు అందుబాటులో లేకపోవడం, వీసా తిరస్కరణలు భారీగా పెరగడం వల్ల ఈ సమస్యలు తలెత్తుతున్నాయి. “ఈ సమయానికి చాలామంది విద్యార్థులు వీసా ఇంటర్వ్యూలు పూర్తిచేసుకుని, అమెరికా ప్రయాణానికి సిద్ధంగా ఉండేవారు. కానీ ఇప్పుడేమిటంటే… ప్రతి రోజు స్లాట్ వస్తుందేమో అని పోర్టల్ ఓపెన్ చేస్తూనే ఉన్నాం,” అని ఓవర్సీస్ కన్సల్టెంట్ సంజీవ్ రాయ్ చెబుతున్నారు.

అతి స్పష్టత లేదు – విద్యార్థుల భయం పెరిగింది
అమెరికా అధికారులు దశలవారీగా స్లాట్లు విడుదల చేస్తామని చెబుతున్నప్పటికీ, ఎలాంటి స్పష్టత లేకపోవడం వల్ల విద్యార్థులు గందరగోళానికి లోనవుతున్నారు. “స్లాట్ బుక్ చేసిన వాళ్లే కన్ఫర్మేషన్ పొందలేకపోతున్నారు,” అని విండో ఓవర్సీస్ కన్సల్టెన్సీకి చెందిన అంకిత్ జైన్ వివరించారు. అందుకే కొంతమంది విద్యార్థులు అమెరికా బదులు ఇతర దేశాలను ఎంచుకోవడం ప్రారంభించారు.“ఇలా ఉంటే నేను ఏడు నెలల సమయాన్ని కోల్పోతాను. అందుకే దరఖాస్తు వెనక్కి తీసుకున్నాను,” అని ఓ విద్యార్థి ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రస్తుతం అతను ఆటోమోటివ్ ఇంజనీరింగ్లో మాస్టర్స్ కోసం జర్మనీని ఎంచుకున్నాడట.
యూరప్కు మారుతోన్న ఫోకస్
గత ఏడాది భారత్ నుంచి 3.3 లక్షల మంది విద్యార్థులు అమెరికా వెళ్లగా, ఇప్పటి పరిస్థితులు భిన్నంగా మారాయి. విదేశాంగ మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం, 2024 జనవరి నాటికి 11.6 లక్షల మంది భారతీయ విద్యార్థులు విదేశాల్లో ఉన్నత విద్యలో చేరారు. ఈ క్రమంలో, అమెరికా స్థానంలో యూరప్ ఇప్పుడు కొత్త గమ్యంగా మారుతోందని విశ్లేషకులు చెబుతున్నారు.వీసా చికాకులు విద్యార్థుల కలల మీద నీళ్లు చల్లుతున్నాయి. అమెరికా మరిచి, విద్యార్థులు ఇతర దేశాల్లో అవకాశాలను అన్వేషిస్తున్నారు. ఇది విద్యావలసల దిశను కొత్తగా మలుస్తోంది.
Read Also : Russia : బాటిళ్లలో విషం.. నీళ్లు తాగి మృతి చెందిన నలుగురు రష్యా సైనికులు