Hamas Lashkar meeting : పాకిస్తాన్లో ఉగ్రవాద సంస్థల మధ్య సంబంధాలు మరింత బలపడుతున్నాయనే సంకేతాలు తాజాగా బయటపడ్డాయి. హమాస్ మరియు లష్కర్-ఎ-తోయిబా (LeT) కీలక నేతలు పాకిస్తాన్లో సమావేశమైనట్లు తెలుస్తోంది. హమాస్ సీనియర్ కమాండర్ నాజీ జహీర్, లష్కర్ కమాండర్ రషీద్ అలీ సంధును పాకిస్తాన్లోని గుజ్రాన్వాలాలో కలుసుకున్నాడు. ఈ భేటీ పాకిస్తాన్ మార్కజీ ముస్లిం లీగ్ (PMML) నిర్వహించిన కార్యక్రమంలో జరిగినట్లు సమాచారం. ఈ పార్టీ లష్కర్కు రాజకీయ ముఖచిత్రంగా భావించబడుతోంది.
ఇటీవల వెలుగులోకి వచ్చిన ఒక తేదీ లేని వీడియోలో (Hamas Lashkar meeting) నాజీ జహీర్, రషీద్ అలీ సంధు ఒకే వేదికపై కనిపించారు. ఆ కార్యక్రమానికి నాజీ జహీర్ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. రషీద్ అలీ సంధు అధికారికంగా PMML నాయకుడిగా ఉన్నప్పటికీ, అతడు లష్కర్ కమాండర్గా గుర్తింపు పొందాడు. ఈ సమావేశం ద్వారా అమెరికా నిషేధించిన రెండు ఉగ్రసంస్థల మధ్య సంబంధాలు మరింత విస్తరిస్తున్నాయనే ఆందోళనలు పెరుగుతున్నాయి.
Read also: Kamareddy Crime: భార్య, బిడ్డలను పోషించలేక తండ్రి ఆత్మహత్య
నాజీ జహీర్కు పాకిస్తాన్తో ఉన్న సంబంధాలు కొత్తవి కావు. 2025 ఫిబ్రవరిలో పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ను సందర్శించిన ఆయన, పహల్గామ్ ఉగ్రదాడికి కొన్ని వారాల ముందే అక్కడ లష్కర్, జైష్-ఎ-మొహమ్మద్ నేతలతో కలిసి భారత్ వ్యతిరేక ర్యాలీలో పాల్గొన్నారు. అంతకుముందు 2024 జనవరిలో కరాచీ ప్రెస్ క్లబ్లో మీడియాను ఉద్దేశించి మాట్లాడారు. అదే ఏడాది ఏప్రిల్లో ఇస్లామాబాద్ వెళ్లి హైకోర్టు బార్ అసోసియేషన్ నుంచి సన్మానం కూడా అందుకున్నారు.
2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్పై జరిగిన ఉగ్రదాడి తర్వాత, అక్టోబర్ 14న నాజీ జహీర్ పాకిస్తాన్కు వెళ్లి జమియత్ ఉలేమా-ఎ-ఇస్లాం అధినేత మౌలానా ఫజ్లుర్ రెహ్మాన్ను కలిశాడు. అదే రోజు పేశావర్లో జరిగిన ముఫ్తీ మహ్మూద్ కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు. ఆ సమావేశంలో ఖాలెద్ మషాల్ వీడియో లింక్ ద్వారా ప్రసంగించారు.
అదే నెల 29న బలోచిస్తాన్లోని క్వెట్టాలో జరిగిన “అల్-అక్సా స్టార్మ్” సమావేశంలో జహీర్ పాల్గొన్నారు. 2023 నవంబర్లో కరాచీలో జరిగిన “తూఫాన్-ఎ-అక్సా” సమావేశంలో కూడా ఆయన హాజరయ్యారు. ఈ వరుస పర్యటనలు పాకిస్తాన్లో హమాస్కు పెరుగుతున్న ప్రాధాన్యతను, అలాగే అక్కడి ఉగ్రసంస్థలతో జరుగుతున్న సమన్వయాన్ని స్పష్టంగా చూపిస్తున్నాయి.
ఈ పరిణామాలన్నీ పాకిస్తాన్ ‘డీప్ స్టేట్’ మద్దతుతోనే జరుగుతున్నాయని అంతర్జాతీయ వర్గాలు అనుమానిస్తున్నాయి. ఇదే సమయంలో గాజాలో భవిష్యత్తులో ఏర్పాటు చేయనున్న అంతర్జాతీయ స్థిరీకరణ బలగాల్లో పాకిస్తాన్ సైన్యం భాగస్వామ్యం కావాలని అమెరికా భావిస్తున్నట్లు సమాచారం. డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన 20 పాయింట్ల గాజా ప్రణాళికలో యుద్ధంతో ధ్వంసమైన ప్రాంత పునర్నిర్మాణానికి అంతర్జాతీయ బలగాల కీలక పాత్రను ప్రస్తావించారు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: