పాకిస్తాన్లో జాఫర్ ఎక్స్ప్రెస్ హైజాక్ కావడం దేశవ్యాప్తంగా తీవ్ర ఉద్రిక్తతలను రేకెత్తించింది. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ) తిరుగుబాటుదారులు ఈ ఘటనకు పాల్పడ్డారు. హైజాక్ అనంతరం పాకిస్తాన్ ప్రభుత్వం దేశవ్యాప్తంగా హైఅలర్ట్ ప్రకటించింది. సైన్యాన్ని అప్రమత్తం చేసింది. ఈ ఘటనకు సంబంధించి అనేక ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు. బీఎల్ఏ తిరుగుబాటుదారుల ఆధీనంలోనే ఇంకా రైలు ఉందని సమాచారం.
బలూచిస్తాన్లో తీవ్ర స్థాయిలో ఉద్రిక్తతలు
జాఫర్ ఎక్స్ప్రెస్ పాకిస్తాన్లోని క్వెట్టా-పెషావర్ మార్గంలో నిత్యం రాకపోకలు సాగించే రైలు. 1,632 కిలోమీటర్ల దూరాన్ని ఈ రైలు కవర్ చేస్తుంది. ఈ మధ్యాహ్నం క్వెట్టా నుంచి బయలుదేరిన కొద్దిసేపటికే బలూచిస్తాన్ ప్రావిన్స్లోని సిబి స్టేషన్ వద్ద బీఎల్ఏ తిరుగుబాటుదారులు దానిని హైజాక్ చేశారు. ఈ ప్రాంతం మొత్తం తిరుగుబాటుదారుల ఆధీనంలో ఉండటంతో, ఇప్పటి వరకు పాకిస్తాన్ సైన్యం ఎలాంటి చర్యలు తీసుకోలేకపోయింది.
భారీ ఎదురు కాల్పులు – 20 మంది సైనికుల మృతి
బీఎల్ఏ అధికారిక ప్రకటన ప్రకారం, హైజాక్ అనంతరం జరిగిన ఎదురు కాల్పుల్లో 20 మంది పాకిస్తాన్ సైనికులు మృతి చెందారు. ఇంకా 182 మంది ప్రయాణికులు తమ ఆధీనంలో ఉన్నట్లు ప్రకటించింది. సైనిక దళాలు హైజాక్ను అరికట్టేందుకు యత్నించినప్పటికీ, తిరుగుబాటుదారులు గట్టి నిరోధాన్ని చూపుతున్నారు. ఈ ఘటన కారణంగా బలూచిస్తాన్ ప్రాంతంలో భయాందోళనలు నెలకొన్నాయి.

సైనిక చర్యలు – పెరుగుతున్న సంక్షోభం
పాకిస్తాన్ సైన్యం ఈ ఘటనను సమర్థంగా ఎదుర్కొనడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ, తిరుగుబాటుదారులు మిలిటరీ డ్రోన్లను సైతం కూల్చివేశారని సమాచారం. అంతేగాక, సిబి సమీపంలోని ఒక రైలు టన్నెల్ ట్రాక్ను పేల్చివేశారని బీఎల్ఏ ప్రకటించింది. ఇప్పటివరకు ప్రభుత్వ అధికారుల నుంచి పూర్తి స్థాయి ప్రకటన రాలేదు. అయితే, ఈ హైజాక్ కారణంగా దేశంలో భద్రతా పరిస్థితులు మరింత దారుణంగా మారే అవకాశం ఉంది.