పహల్గాం తీవ్రవాద దాడి తర్వాత పాకిస్తాన్ పై అంతర్జాతీయంగా తీవ్ర ఒత్తిడి ఉంది. ఓవైపు పొరుగుదేశం భారత్ ఇప్పటికే పలు సంచలన నిర్ణయాలతో పాకిస్తాన్ ను అష్టదిగ్బంధం చేస్తోంది. ఏ క్షణమైనా యుద్ధ ప్రకటన వచ్చినా ఆశ్చర్యం లేదనే చర్చ జరుగుతోంది. ఇలాంటి సమయంలో ఆర్ధిక ఇబ్బందులతో సతమతమవుతున్న పాకిస్తాన్ కు ప్రపంచ బ్యాంక్ భారీ ఊరటనిచ్చింది. పాకిస్తాన్ కు ఏకంగా 108 మిలియన్ల అమెరికా డాలర్ల సాయం అందించింది. వాయువ్య పాకిస్తాన్లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్లో మహిళలు, బాలికల జీవితాలను మెరుగుపరచడానికి ప్రపంచ బ్యాంకు 108 మిలియన్ల అదనపు నిధులను మంజూరు చేసింది. పఖ్తుంఖ్వా ఇంటిగ్రేటెడ్ టూరిజం డెవలప్మెంట్ మరియు ఖైబర్ పఖ్తుంఖ్వా రూరల్ యాక్సెసిబిలిటీ ప్రాజెక్ట్ ల కోసం 30, 78 మిలియన్ డాలర్ల చొప్పున మొత్తం 108 మిలియన్ డాలర్ల సాయం విడుదల చేసింది. మార్కెట్లు, ఉద్యోగాలు, ఆరోగ్యం, విద్య సేవల అభివృద్ది కోసం ఈ నిధులు ఇచ్చినట్లు ప్రపంచ బ్యాంక్ తెలిపింది.
ప్రావిన్స్ అభివృద్ధి లక్ష్యాల కోసం ..
ఈ నిధుల్ని గ్రామీణ రోడ్లను అప్గ్రేడ్ చేయడం, పునరుద్ధరించడం ద్వారా సురక్షితమైన, వాతావరణానికి అనుగుణంగా ఉండే రహదారి మౌలిక సదుపాయాలను అందించడం కోసం ఖర్చుపెట్టాల్సి ఉంటుంది. తద్వారా పాఠశాలలు, ఆరోగ్య సౌకర్యాలు , మార్కెట్లు వంటి సేవల్ని జనానికి అందుబాటులోకి తెస్తారు. పాకిస్తాన్, ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్ అభివృద్ధి లక్ష్యాల కోసం ప్రపంచ బ్యాంక్ ఈ నిధులు ఇచ్చినట్లు ప్రాజెక్ట్ డైరెక్టర్ వెల్లడించారు. అయితే ప్రస్తుతం పాకిస్తాన్ తీవ్ర ఆర్ధిక ఇబ్బందుల్లో కూరుకుపోయి ఉంది. ఇప్పటికే ప్రపంచ బ్యాంక్ పలు దఫాలుగా వందల మిలియన్ డాలర్ల సాయం అందిస్తూనే ఉంది. అయితే ఈ సాయం ఏమాత్రం సరిపోయేలా లేదు. దీంతో వివిధ అభివృద్ధి పథకాల పేరుతోనూ సాయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. కానీ పహల్గాం దాడి తర్వాత యుద్ధానికి కాలు దువ్వుతున్న పాకిస్తాన్ కు ఈ నిధుల లభ్యత ఊరటనిచ్చే అంశంగానే చెప్పవచ్చు.
Read Also: Pakistan India War: టర్కీ సైనిక అధికారులు పాకిస్తాన్లో పర్యటన.. దేనికి సంకేతం?