అమెరికా, చైనా మధ్య వాణిజ్య యుద్ధం రోజురోజుకు ముదురుతోంది. భారీ ట్యారిఫ్లు, పరస్పర ఆంక్షలతో ఇప్పటికే ఆర్థిక వ్యవస్థలపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఈ క్రమంలో, చైనా తాజా నిర్ణయం కాస్త మార్పును సూచిస్తోంది. అమెరికా నుంచి దిగుమతి అయ్యే కొన్ని కీలక ఉత్పత్తులపై విధించిన 125% సుంకాలను తొలగించే అవకాశంపై బీజింగ్ ఆలోచిస్తున్నట్టు సమాచారం.ఇదే నిజమైతే, వాణిజ్య రంగంలో ఇది ఒక శుభసంకేతంగా చెప్పొచ్చు. ముఖ్యంగా అమెరికా నుంచి దిగుమతి అయ్యే ఈథేన్ వంటి పారిశ్రామిక రసాయనాలు, వైద్య పరికరాలు వంటి వాటిపై చైనా మినహాయింపు ఇచ్చే అవకాశాలపై పరిశీలన జరుపుతోంది. ఈ ఉత్పత్తులు కొన్ని రంగాలకు కీలకమైనవిగా భావించబడుతున్నాయి.అంతేకాదు, విమానాల లీజుకు సంబంధించిన చెల్లింపులపై సైతం చైనా సుంకాల మినహాయింపు యోచనలో ఉంది. చైనాలో ఉన్న అనేక విమానయాన సంస్థలు విదేశీ కంపెనీల నుంచి విమానాలు లీజుకు తీసుకుంటాయి. వాటిపై చెల్లించే సుంకాలు సంస్థలపై ఆర్థిక భారం పెంచుతున్నాయి.
ఇప్పుడు వాణిజ్య యుద్ధం కారణంగా ఈ ఖర్చులు మరింత పెరిగాయి. అందుకే ఈ రంగంలో మినహాయింపు అవసరం అనే తీర్మానం బీజింగ్ తీసుకునేలా కనిపిస్తోంది.ఇటీవలి వారాల్లో అమెరికా, చైనా రెండూ తమ ఉత్పత్తులపై ఒకరిపై ఒకరు భారీగా సుంకాలు విధించాయి. అమెరికా 145% వరకు ట్యారిఫ్లు అమలు చేయగా, ప్రతిగా చైనా 125% వరకు విధించింది. ఈ ప్రతీకార చర్యల వల్ల గ్లోబల్ మార్కెట్లపై ఒత్తిడి పెరిగింది.ఇప్పటివరకు చర్చలు జరుగుతున్నాయన్న వ్యాఖ్యలు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసినా, చైనా మాత్రం దీనిని స్పష్టంగా ఖండించింది. చర్చలు ఎక్కడా జరగడం లేదని చైనా విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. అయినప్పటికీ, కొన్ని కీలక ఉత్పత్తులపై సుంకాల్లో మినహాయింపు ఇవ్వడం అంటే చైనా కొంత వెనకడుగు వేసినట్టే కనిపిస్తోంది.ఈ మార్పులు వస్తే, రెండు దేశాల మధ్య ఉక్కిరిబిక్కిరి అవుతున్న వాణిజ్య సంబంధాలు కొంత మెరుగవుతాయని ఆశిస్తున్నారు. వ్యాపార వర్గాలు, పరిశ్రమలు ఈ పరిణామాలను ఆసక్తిగా గమనిస్తున్నాయి.ఈ పరిణామం భారత్ వంటి దేశాలకూ ప్రభావం చూపే అవకాశం ఉంది. అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం తగ్గితే, గ్లోబల్ సరఫరా శృంఖలలో స్థిరత్వం వచ్చే అవకాశం ఉంది. దీనివల్ల ప్రపంచ ఆర్థిక వృద్ధికి బలమైన ప్రోత్సాహం లభించవచ్చు.
Read Also : Danish Kaneria : ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నట్లే ఉన్నాయి: డానిష్ కనేరియా