మహారాష్ట్ర (Maharastra) ప్రభుత్వం విద్యారంగంలో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని పాఠశాలల్లో ఇకపై ఒకటో తరగతి నుంచే విద్యార్థులకు ప్రాథమిక సైనిక శిక్షణ (బేసిక్ మిలిటరీ ట్రైనింగ్) (Basic military training) ఇవ్వాలని సంకల్పించింది. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో చిన్నతనం నుంచే దేశభక్తి, క్రమశిక్షణ, శారీరక దృఢత్వం వంటి మంచి లక్షణాలను పెంపొందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ విషయాన్ని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి దాదా భూసే (Dadaji Bhuse) వెల్లడించారు. ప్రాథమిక స్థాయి నుంచే విద్యార్థులకు ఈ శిక్షణ ఇవ్వడం వల్ల అత్యవసర పరిస్థితుల్లో ఎలా స్పందించాలనే దానిపై వారికి అవగాహన కలుగుతుందని మంత్రి దాదా భూసే (Dadaji Bhuse) తెలిపారు. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పాఠశాలల్లో మాజీ సైనికులతో ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ శిక్షణ ద్వారా విద్యార్థుల్లో దేశం పట్ల ప్రేమ, గౌరవం మరింత పెరుగుతాయని ఆయన అభిప్రాయపడ్డారు.
ఎన్సీసీ, స్కౌట్స్, గైడ్స్తో సమన్వయం
ఈ ప్రతిపాదనకు ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కూడా సానుకూలంగా స్పందించారని విద్యాశాఖ మంత్రి దాదా భూసే (Dadaji Bhuse) వివరించారు. ఈ కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయడానికి క్రీడా ఉపాధ్యాయులు, నేషనల్ క్యాడెట్ కార్ప్స్ (ఎన్సీసీ), స్కౌట్స్ అండ్ గైడ్స్తో పాటు సుమారు 2.5 లక్షల మంది రిటైర్డ్ సైనికుల సహాయ సహకారాలు తీసుకోనున్నట్లు ఆయన తెలిపారు. ఏప్రిల్ 22న పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడి, ఆ తర్వాత భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ సిందూర్ పరిణామాల నేపథ్యంలో ఈ సైనిక శిక్షణ ప్రతిపాదనను ముందుకు తెచ్చినట్లు మంత్రి భూసే (Dadaji Bhuse) స్పష్టం చేశారు. కశ్మీర్లోని పహల్గామ్ బైసరన్ లోయలో ఏప్రిల్ 22న పర్యాటకులపై ఉగ్రవాదులు జరిపిన దారుణ దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ఘటన అనంతరం, ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తోందని ఆరోపిస్తూ పాకిస్థాన్పై భారత ప్రభుత్వం దౌత్యపరమైన చర్యలు చేపట్టింది. ఇదే సమయంలో, భూకంపాలు, అగ్నిప్రమాదాలు, వరదలు, ఉగ్రదాడులు వంటి విపత్కర పరిస్థితులు ఎదురైనప్పుడు ప్రజలు, అధికారులు తమను తాము ఎలా కాపాడుకోవాలో అవగాహన కల్పించేందుకు దేశవ్యాప్తంగా 259 ప్రాంతాల్లో మాక్ డ్రిల్స్ కూడా నిర్వహించారు.ఈ కొత్త విధానంతో మహారాష్ట్ర ప్రభుత్వం విద్యా రంగంలో శక్తివంతమైన మార్పు తీసుకురానుంది. జాతీయ భద్రతను పాఠశాల స్థాయిలోనే సామాన్య జ్ఞానంగా మార్చే దిశగా ఇది ఒక తొలి అడుగు.
Read Also: IPL Final: ఐపీఎల్ ఫైనల్.. ఈసారి కప్ మనదే: డీకే శివకుమార్