ఇటీవలకాలంలో బంగ్లాదేశ్ లో(Bangladesh) హింసాత్మక సంఘటనలు పెరిగిపోతున్నాయి. నిత్యం ప్రజలు రోడ్లపైకి వచ్చి, దాడులకు పాల్పడుతున్నారు. ప్రభుత్వ ఆస్తులకు నష్టం చేస్తున్నారు. అక్కడ శాంతిభద్రతలు ఏమాత్రం లేవు. భారతీయ ఎంబసీలపై దాడులకు పాల్పడ్డారు. దీంతో ముందుజాగ్రత్త చర్యగా భారత్ తో సహా అమెరికా, జర్మనీ దేశాల ఎంబసీలు కూడా క్రిస్మస్ నాడు మూతపడ్డాయి. బంగ్లాదేశ్లో ప్రస్తుతం పరిస్థితులు అత్యంత భయానకంగా ఉన్నాయని, మైనారిటీల పాణాలకు రక్షణ లేకుండా పోయిందని ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం మైనారిటీలపై జరుగుతున్న దాడులను అరికట్టడంలో విఫలమవ్వడమే కాకుండా అరాచక శక్తులకు వత్తాసు పలుకుతోందని ఆమె మండిపడ్డారు. క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని గురువారం ఆమె విడుదల చేసిన ఒక ప్రకటనలో ప్రస్తుత ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు.
Read Also: December 26: ‘బాక్సింగ్ డే’ పేరెలా వచ్చిందంటే?
అంతులేని అకృత్యాలు జరుగుతున్నాయి…
ముస్లిమేతర సమాజంపై ముఖ్యంగా హిందువులపై జరుగుతున్న దాడులను ప్రస్తావిస్తూ షేక్ హసీనా ఆవేదన వ్యక్తం చేశారు. (Bangladesh) ‘బంగ్లాదేశ్ లో మైనారిటీలను సజీవ దహనం చేసే దుర్మార్గపు సంప్రదాయానికి ఈ ప్రభుత్వం తెరలేపింది. ముస్లిమేతరులపై వర్ణనాతీతమైన అకృత్యాలు జరుగుతున్నాయి. మత స్వేచ్ఛను హరిస్తూ, ప్రజలు తమ విశ్వాసాలను పాటించకుండా అడ్డంకులు సృష్టిస్తున్నారు అని ఆమె ధ్వజమెత్తారు. ఇటీవల మైమెన్ సింగ్ లో 25ఏళ్ల హిందూ యువకుడిని గుంపుగా చేరి కొట్టి చంపిన ఘటనను ఆమె ఉదాహరణగా పేర్కొన్నారు. బంగ్లాదేశ్ ప్రజలు ఈ చీకటి రోజులను ఎంతోకాలం సహించబోమని ఆమె హెచ్చరించారు.
యూనస్ కు పాలించే హక్కు లేదు: హసీనా
మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని ప్రభుత్వానికి పాలించే నైతిక హక్కు లేదని షేక్ హసీనా స్పష్టం చేశారు. ‘ఈ ప్రభుత్వం ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికైనది కాదని, కేవలం ఒక తిరుగుబాటు ద్వారా అధికారాన్ని చేజిక్కించుకున్నారు. చట్టబద్ధత లేని ఈ పాలనలో ప్రజల ప్రాణాలకు విలువ లేకుండా పోయింది’ అని ఆమె పేర్కొన్నారు. ఇదే సమయంలో క్రైస్తవ సోదరులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుతూ.. యేసుక్రీస్తు చూపి మార్గంలో చీకటి తొలగి వెలుగులు రావాలని, బంగ్లాదేశ్ లో మత సామరస్యం మళ్లీ వెల్లివిరియాలని ఆమె ఆకాంక్షించారు. అయితే వరుసగా జరుగుతున్న ఈ హత్యాకాండలు బంగ్లాదేశ్ లో మైనారిటీల భద్రతపై అంతర్జాతీయంగా ఆందోళనలు కలిగిస్తున్నాయి. ఈ పరిణామాలు చూస్తుంటే.. బంగ్లాదేశ్ లో రాజకీయ అస్థిరతతో పాటు మతపరమైన చిచ్చు మరింత ముదురుతున్నట్లు కనిపిస్తోంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: