కీవ్: ఇటీవల వైట్హౌస్ వేదికగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ , ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ మధ్య వాగ్వాదం నెలకొన్న విషయం తెలిసిందే. ఆ సమయంలో ట్రంప్ మాట్లాడుతూ ఉక్రెయిన్లో జెలెన్స్కీకి ప్రజల మద్దతు లేదని.. ఆయన ఓ నియంత అంటూ వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో పలు సంస్థలు ఉక్రెయిన్లో జెలెన్స్కీకి ఉన్న మద్దతుపై అభిప్రాయ సేకరణలు చేపట్టాయి. తాజాగా విడుదలైన నివేదికల్లో ట్రంప్తో వాగ్వాదం తర్వాత ఆయనకు ప్రజామోదం 10 శాతం పెరిగినట్లు తెలుస్తోంది.
అదే జెలెన్స్కీకి మద్దతు పెరగడానికి ముఖ్య కారణం
కీవ్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషియాలజీ నిర్వహించిన పోల్లో 67శాతం ఉక్రెయిన్ ప్రజలు తాము జెలెన్స్కీని విశ్వసిస్తున్నామని తెలిపారు. తొలుత 57శాతంగా ఉన్న ఆయన మద్దతుదారులు అమెరికాలో ట్రంప్తో భేటీ అనంతరం 10 శాతం పెరిగారని పేర్కొన్నారు. ట్రంప్ దురుసు ప్రవర్తనతో తమ అధినేతను అవమానించినట్లు ప్రజలు భావించారని.. అదే జెలెన్స్కీకి మద్దతు పెరగడానికి ముఖ్య కారణమని భావిస్తున్నారు.
కాస్త భూమితో పోయేదాన్ని యుద్ధం వరకూ
డొనాల్డ్ ట్రంప్ , జెలెన్స్కీ మధ్య శాంతి చర్చలు రసాభాసగా మారిన విషయం తెలిసిందే. అనంతరం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ జెలెన్స్కీని ఓ నియంతగా అభివర్ణించారు. రష్యా తమ భూభాగాన్ని ఆక్రమించిందనే ఉక్రెయిన్ వాదనను తప్పుబట్టారు. కాస్త భూమితో పోయేదాన్ని యుద్ధం వరకూ తీసుకొచ్చారంటూ నిందించారు. ఇప్పుడు ఎక్కువ భూమి సహా పెద్ద సంఖ్యలో ప్రజలు ప్రాణాల్ని సైతం కోల్పోవాల్సి వచ్చిందని మండిపడ్డారు. యుద్ధానికి ఉక్రెయినే కారణమని, పోరు మొదలు కావడానికి ముందే సంధి చేసుకుని ఉండాల్సిందన్నారు. జెలెన్స్కీకి తమ దేశంలో ప్రజామద్దతు 4 శాతమే ఉందని వ్యాఖ్యానించారు. కాగా ట్రంప్ వ్యాఖ్యలను ఉక్రెయిన్ అధ్యక్షుడు కొట్టిపారేశారు.