ఏప్రిల్ 22 యావత్ భారతావని ఒక్కసారిగా ఉలిక్కిపడిన రోజు. ప్రశాంతమైన స్వర్గం లాంటి కాశ్మీర్ లో రక్తపుటేరులు పారిన రోజు. సమ్మర్ ట్రిప్ ఎంజాయ్ చేద్దామని దేశ నలుమూలల నుంచి కాశ్మీర్ లోని పహల్గాంకు వెళ్లిన టూరిస్టులపై ఉగ్రమూక విరుచుకు పడింది. 26 మంది అమాయకుల ప్రాణాలను తీసుకుంది. ఆ రోజు నుంచి కాశ్మీర్ ప్రజలు బిక్కుబిక్కు మంటూ గడుపుతున్నారు. పహల్గాం ఉగ్రదాడి తర్వాత అంతా మారిపోయింది. ఓ వైపు జీవనాధారం కోల్పోయి.. మరోవైపు ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక 19 రోజులు నరకయాతన అనుభవించారు. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకగా భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని 9 కీలక ఉగ్రవాద ట్రైనింగ్ క్యాంప్స్ పై దాడులు చేసింది. ఈ దాడుల్లో దాదాపు 100 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు ఆర్మీ అధికారులు స్పష్టం చేశారు.
ఉగ్రవాద శిబిరాలపై భారత్ దాడులు
భారత్ ఆపరేషన్ సింధూర్ పేరుతో దాడులు ప్రారంభిస్తే.. పాకిస్థాన్ కూడా కాశ్మీర్ సరిహద్దు ప్రాంతాలపై డ్రోన్లతో దాడి చేసింది. అయితే వాటిని భారత సేన దీటుగా తిప్పికొట్టింది. అయితే ఈ ఉద్రిక్తతల మధ్య దాదాపు 19 రోజుల పాటు కాశ్మీర్ ప్రజలు కంటి మీద కునుకు లేకుండా గడిపారు. ఏ క్షణం తమ ఇంటిపై బాంబులు పడతాయోనని అనుక్షణం బిక్కుబిక్కు మంటూ గడిపామని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. ఏప్రిల్ 22 న మొదలైన అలజడి మే 11న ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఆగిపోవడంతో సద్దుమణిగిందు. ఏప్రిల్ 22న పహల్గాంలో ఉగ్రదాడితో కాశ్మీర్ ప్రజల్లో భయాందోళన మొదలైంది. ఇక సరిహద్దు జిల్లాల ప్రజల గురించి అయితే చెప్పనవసరం లేదు. వారి బాధ వర్ణనాతీతం. ఇక మే 6 అర్ధరాత్రి ఆపరేషన్ సిందూర్ చేపట్టినప్పటి నుంచి.. శనివారం సాయంత్రం 5 గంటలకు కాల్పుల విరమణ ఒప్పందం జరిగే వరకూ ఇరు దేశాల నియంత్రణ రేఖ (ఎల్ఓసీ) వెంబడి పరిస్థితులు ఘోరంగా మారాయి . నిప్పుల వర్షం కురుస్తున్న ఆకాశంలా, బాంబుల మోతతో ఉన్న సంగతి తెలిసిందే.
బ్లాక్ అవుట్ – చీకటిలో ప్రజల పస్తులు
ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలతో నియంత్రణ రేఖ (ఎల్ఓసీ) వెంబడి ఉన్న జిల్లాల ప్రజలు 19 రోజులపాటు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని జీవించారు. అయితే శనివారం సాయంత్రం భారత్ – పాక్ లు కాల్పుల విరమణకు అంగీకరించిన తర్వాత.. ఆదివారం- సోమవారం మధ్య రాత్రి జమ్మూ కశ్మీర్, అంతర్జాతీయ సరిహద్దు (ఐబీ) వెంబడి ఉన్న ప్రాంతాల్లో చాలా వరకూ ప్రశాంతంగా ఉందని అక్కడి ప్రజలు తెలిపారు. నో షెల్లింగ్, నో ఫైరింగ్.. కారణంగా 19 రోజుల తర్వాత మొదటి ప్రశాంతమైన రాత్రిని చూశామని.. నిద్రపోయామని అన్నారు. ఏప్రిల్ 22 నుంచి నియంత్రణ రేఖ వెంబడి పాక్ సైన్యం కాల్పుల విరమణ ఉల్లంఘనలకు పాల్పడుతూనే ఉందని స్థానికులు చెబుతున్నారు. ప్రధానంగా మే 7 నుంచి 11 మధ్య అయితే ఫిరంగుల మోతలు, వైమానిక దాడులతో తమ ప్రాంతం అట్టడుగైపోయిందని తెలిపారు. నిజానికి శనివారం సాయంత్రమే కాల్పుల విరమణ జరిగింది. కానీ పలు ప్రాంతాల్లో పాక్ తన దొంగ బుద్ధిని ప్రదర్శించింది. ఈ క్రమంలో సూరన్ కోట్ మొదలైన ప్రాంతాల్లో కాల్పులు జరిగాయి. దీంతో.. నివాసితులు పట్టణం నుంచి పారిపోయారు. కొంతమంది సమీప కొండ గ్రామాల్లో ఆశ్రయం పొందారు. అయితే.. అదివారం అంతా ఇళ్లకు తిరిగి చేరుకున్నట్లు సమాచారం అందుతోంది.
ప్రశాంత ఒయాసిస్ – కాల్పుల విరమణ
మరీ మే 7 నుంచి బ్లాక్ అవుట్ కారణంగా చీకట్లో అనేక ఇబ్బందుల్లో గడిపారు కాశ్మీర్ ప్రజలు. తాజాగా కాశ్మీర్, జమ్ము ప్రాంతాల్లో బ్లాక్ అవుట్ ఎత్తివేయడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఇప్పుడు అక్కడి పరిస్థితి సాధారణ స్థితికి వచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు కాశ్మీర్ కు ఎప్పటిలాగే పర్యాటకానికి రావాలని ఆ రాష్ట్ర సీఎం ఓమర్ అబ్దుల్లా పిలుపునిచ్చారు. టూరిజంతోనే అక్కడి ప్రాంతానికి ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని అభిప్రాయపడ్డారు. పహల్గాం దాడితో కశ్మీర్ లో ఏళ్ల తరబడి జరిగిన ఆర్థిక, దౌత్య పరమైన అభివృద్ధి ఒక్కసారిగా కుప్పకూలిందని జమ్మూ కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా ఆవేదన వ్యక్తం చేశారు. తాము ఊహించని స్థితిలో ఉన్నామని.. రక్తపాతం, బాధ, ఆందోళన, మార్పు, క్షోభ.. అన్నీ జరిగాయన్నరు. మరోవైపు ఇవాళ భారత్, పాకిస్థాన్ ల మధ్య శాంతి చర్చలు జరగనున్నాయి. మిలటరీ ఆపరేషన్ డైరెక్టర్ జనరల్స్ మధ్య హాట్లైన్ ద్వారా చర్చలు జరగనున్నాయి. ఈ క్రమంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నివాసంలో కీలక సమావేశం నిర్వహించారు. పీఓకే ను తమకు అప్పగించడమే ప్రధాన ఎజెండాగా భారత్ ముందుకెళ్లాలని భావిస్తోంది. ఇక ఈ సమావేశంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, సీడీఎస్ అనిల్ చౌహన్ హాజరయ్యారు. వీరితో పాటు త్రివిధ దళాధిపతులు ఈ మీటింగ్ కు హాజరయ్యారు. పలు కీలక అంశాలపై చర్చలు జరిపారు.
Read Also: