భారతదేశానికీ కొత్త సవాళ్లు: బంగ్లాదేశ్-పాక్ సాన్నిహిత్యం
బంగ్లాదేశ్-పాక్ సాన్నిహిత్యం భారతదేశానికి పెద్ద చర్చనీయాంశమైంది. 1971 భారత-పాక్ యుద్ధం తర్వాత పాకిస్తాన్ సైన్యానికి మరోసారి బంగ్లాదేశ్లో అడుగు పెట్టే అవకాశం కల్పించబడింది.
నవంబర్ 2024లో పాకిస్థాన్ ఆర్మీ జాయింట్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ కమిటీ చైర్మన్ జనరల్ షాహిర్ శంషాద్ మీర్జా బంగ్లాదేశ్కు శిక్షణ ప్రతిపాదనను పంపారు. ఈ ప్రతిపాదనను బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ వాకర్-ఉజ్-జమాన్ స్వీకరించారు.
పాకిస్తాన్ సైన్యానికి చెందిన బృందం ఫిబ్రవరి 2025లో బంగ్లాదేశ్లో శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. మొదటి దశ మొమెన్షాహి కంటోన్మెంట్లో జరుగుతుంది. ఏడాది పాటు కొనసాగే ఈ శిక్షణ అనంతరం 10 కమాండ్లకు పాకిస్థాన్ ఆర్మీ ప్రత్యేక శిక్షణ అందిస్తుంది. ఈ శిక్షణలో పాకిస్థాన్ మేజర్ జనరల్ ర్యాంక్ అధికారి కీలక పాత్ర పోషిస్తారు.
ఆయుధాల కొనుగోలు
ఇటీవల బంగ్లాదేశ్, పాకిస్థాన్ నుండి పెద్ద ఎత్తున మందుగుండు సామగ్రి ఆర్డర్ చేసింది. సెప్టెంబర్ నుంచి డిసెంబర్ మధ్య 40,000 రౌండ్ల మందుగుండు సామగ్రితో పాటు 2,000 ట్యాంక్ మందుగుండు సామగ్రి, 40 టన్నుల RDXను కూడా ఆర్డర్ చేసింది. గత ఏడాదితో పోల్చితే ఇది మూడు రెట్లు ఎక్కువ కావడం గమనార్హం.
2025లో బంగ్లాదేశ్ నేవీ, పాకిస్థాన్ నేవీతో కలిసి కరాచీ పోర్ట్లో సంయుక్త విన్యాసాలు చేపట్టనుంది. ఈ విన్యాసానికి ‘అమన్ 2025’ అని పేరు పెట్టారు. ఇది 15 ఏళ్ల విరామం తర్వాత జరుగుతున్న భారీ చర్య.
రక్షణ నిపుణులు ఈ పరిణామాలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బంగ్లాదేశ్, పాకిస్థాన్ మధ్య పెరుగుతున్న మైత్రి భారతదేశం కోసం భవిష్యత్తులో సవాలుగా మారవచ్చని అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా, సిలిగురి కారిడార్పై పాకిస్థాన్ మద్దతుతో ఏర్పడే ముప్పు భారతీయ భద్రతకు కీలకంగా మారవచ్చని హెచ్చరిస్తున్నారు.