PM Modi : ప్రధాని మోడీ ప్రస్తుతం బ్యాంకాక్లో బిమ్స్టెక్ సదస్సు నిమిత్తం థాయ్లాండ్ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రధాని మోడీ థాయ్లాండ్లో బర్మా సైనిక ప్రభుత్వ అధినేత జనరల్ మిన్ అంగ్ హ్లాయింగ్తో భేటీ అయ్యారు. భూకంపంతో తీవ్రంగా దెబ్బతిన్న మయన్మార్ను ఆదుకొనేందుకు భారత్ సిద్ధంగా ఉందని ప్రధాని మోడీ హామీ ఇచ్చారు. ఆ దేశాన్ని ఆదుకోవడానికి భారత్ అన్నిరకాల సాయాలు అందిస్తోందని తెలిపారు. ఇక, బ్యాంకాక్లో బిమ్స్టెక్ సదస్సు సందర్భంగా సీనియర్ జనరల్ మిన్ అంగ్ హ్లాయింగ్తో భేటీ అయ్యాను. భూకంపంలోని మృతిచెందిన బాధితులకు మరోసారి సంతాపం తెలిపాను. ఈ కఠిన సమయంలో మయన్మార్లోని మన సోదర సోదరీమణులను ఆదుకొనేందుకు అన్నిరకాల సాయం చేస్తున్నాం. ఇదే సమయంలో ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాల గురించి చర్చించాం. ముఖ్యంగా అనుసంధాన, సామర్థ్యాల పెంపు, మౌలిక వసతుల అభివృద్ధి వంటివి చాలా అంశాలపై మాట్లాడుకొన్నాం అని ప్రధాని ఎక్స్లో చేసిన పోస్టులో వెల్లడించారు.

భారత్కు చెందిన ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఆ దేశంలో సహాయక చర్యలు
కాగా, 2021లో మయన్మార్లో సైనిక తిరుగుబాటు తర్వాత తొలిసారి జనరల్ మిన్ అంగ్తో భారత ప్రధాని భేటీ కావడం ఇదే తొలిసారి. ఈసందర్భంగా భారత సాయానికి మయన్మార్ కృతజ్ఞతలు తెలిపింది. మయన్మార్ భూకంపంలో మృతి చెందిన వారి సంఖ్య నిన్ననే 3 వేలు దాటేసింది. భారత్కు చెందిన ఎన్డీఆర్ఎఫ్ బృందాలు పెద్దసంఖ్యలో ఆ దేశంలో సహాయక చర్యలు చేపట్టాయి. ఆ దళం డిప్యూటీ కమాండర్ కునాల్ తివారీ ఈ కార్యక్రమాలు పర్యవేక్షిస్తున్నారు. మొత్తం 80 మంది సిబ్బంది, నాలుగు జాగిలాలు, రిగ్గింగ్, లిఫ్టింగ్, కటింగ్, బ్రిడ్జింగ్ పరికరాలను మోహరించారు. తమకు స్థానికుల నుంచి పూర్తిస్థాయి మద్దతు లభిస్తోందని తివారీ పేర్కొన్నారు.