ప్రపంచవ్యాప్తంగా క్షయవ్యాధి (ట్యూబర్క్లోసిస్ – TB) వ్యాప్తి క్రమంగా తగ్గుతున్నప్పటికీ, భారత్లో మాత్రం దీనిపై ఆందోళనకర స్థితి నెలకొంది. తాజాగా హైదరాబాద్లో ప్రారంభమైన టీబీ అంశంపై సదస్సులో పలువురు ఆరోగ్య నిపుణులు, పరిశోధకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు భారతదేశంలో అత్యధిక టీబీ కేసులు నమోదు అవుతున్నాయని స్పష్టం చేశారు. ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత్లో టీబీ భాదితుల సంఖ్య ఎక్కువగా ఉండడం ఆందోళన కలిగించే అంశమని పేర్కొన్నారు.
2023లో 3 లక్షల మంది మృతులు
ఈ సదస్సులో నిపుణులు వెల్లడించిన వివరాల ప్రకారం, కేవలం 2023లోనే టీబీ కారణంగా భారత్లో 3 లక్షలమందికి పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ముందస్తుగా గుర్తించి, సమయానికి చికిత్స అందిస్తే ఈ మరణాలను నివారించవచ్చని వారు తెలిపారు. టీబీ అనేది పూర్తిగా తగ్గించగలిగే వ్యాధి అయినప్పటికీ, సరైన అవగాహన లేకపోవడం, తగిన వైద్యం అందకపోవడం వల్ల దీని ప్రభావం ఇంకా కొనసాగుతుందన్నారు.

టీబీపై సమిష్టిగా పోరాటం అవసరం
టీబీపై విజయం సాధించాలంటే ప్రభుత్వం, ఆరోగ్య సంస్థలు, సామాజిక కార్యకర్తలు, ప్రజలు – అందరూ కలసి పనిచేయాల్సిన అవసరం ఉందని పరిశోధకులు సూచిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని, పరీక్షలు, మందులు అందుబాటులో ఉండేలా చూడాలని పేర్కొన్నారు. భారతదేశం వంటి జనాభా ఎక్కువ దేశంలో టీబీ నియంత్రణ ఒక సవాలుగా మారిందని వారు అన్నారు. “టీబీ రహిత భారత్” లక్ష్యంగా ముందుకెళ్లే సమయం ఇదే” అని నిపుణులు స్పష్టం చేశారు.