Latest News: IND vs PAK – ఓటమి పై పాకిస్థాన్ కెప్టెన్ ఏమన్నారంటే?

Read Time:  1 min
IND vs PAK
IND vs PAK
FONT SIZE
GET APP

ఆసియా కప్ 2025 (2025 Asia Cup)సూపర్–4లో భాగంగా ఆదివారం భారత్–పాకిస్థాన్ జట్ల మధ్య జరిగిన పోరు మళ్లీ క్రికెట్ ప్రేమికులకు ఉత్కంఠను పంచింది. అయితే ఈసారి కూడా విజయం భారత జట్టునే వరించింది. సమష్టిగా రాణించిన టీమిండియా ఆరు వికెట్ల తేడాతో పాకిస్థాన్‌పై ఘన విజయం సాధించింది. ముఖ్యంగా పవర్ ప్లేలోనే భారత ఓపెనర్లు ఇచ్చిన దెబ్బ పాకిస్థాన్ జట్టును తేరుకోనివ్వలేదు. అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్ (Abhishek Sharma, Shubman Gill) జంట మొదటి నుంచే ఎదురుదాడి మోడ్‌లోకి వెళ్లి రన్స్‌ను కురిపించారు. కేవలం బంతుల సంఖ్యను తక్కువ చేసి పెద్ద స్కోరు దిశగా పయనించడం భారత బ్యాటర్ల ధోరణి.

ఈ టోర్నీలో పాకిస్థాన్‌ను భారత్ ఓడించడం ఇది రెండోసారి. తొలి మ్యాచ్ ఓటమి అనంతరం మాట్లాడకుండా ముఖం చాటేసిన సల్మాన్ అలీ అఘా (Salman Ali Agha).. తాజా ఓటమిపై బ్రాడ్‌కాస్టర్‌తో మాట్లాడాడు.’ మేము ఇంకా పర్ఫెక్ట్ గేమ్ ఆడలేదు. కానీ ఆ దిశగా సాగుతున్నాం. ఇది గొప్ప మ్యాచ్. కానీ పవర్ ప్లేలోనే భారత ఓపెనర్లు విధ్వంసకర బ్యాటింగ్‌తో మా నుంచి మ్యాచ్‌ను లాగేసుకున్నారు. మా బ్యాటింగ్ సమయంలో 10 ఓవర్ల తర్వాత ఉన్న స్థానాన్ని చూస్తే.. అదనంగా 10-15 పరుగులు చేయాల్సింది.

ప్రధాన వ్యత్యాసం కూడా ఇదే

170-180 పోరాడే లక్ష్యమే కానీ.. పవర్ ప్లేలోనే భారత్ అద్భుతంగా బ్యాటింగ్ చేసింది. ఇరు జట్ల మధ్య ఉన్న ప్రధాన వ్యత్యాసం కూడా ఇదే.బౌలర్లు పరుగులు ఇస్తున్నప్పుడు బౌలర్లను మార్చాల్సి వస్తుంది. టీ20 (T20) ల్లో ఇది సాధారణమే. ఈ మ్యాచ్‌లో ఓడినా మాకు చాలా సానుకూల అంశాలు ఉన్నాయి. ఫకర్ జమాన్, ఫర్షాహన్ అద్భుతంగా బౌలింగ్ చేశారు. బౌలింగ్‌లో హరీస్ రౌఫ్ సత్తా చాటాడు.

శ్రీలంకతో జరిగే మ్యాచ్‌ కోసం ఎదురు చూస్తున్నాం.’అని సల్మాన్ అలీ అఘా చెప్పుకొచ్చాడు.ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 171 పరుగులు చేసింది. సహిబ్జాద ఫర్హాన్(45 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లతో 58) హాఫ్ సెంచరీతో రాణించగా.. ఫహీమ్ అష్రఫ్(8 బంతుల్లో ఫోర్, 2 సిక్స్‌లతో 20 నాటౌట్) దూకుడుగా ఆడాడు.

టీమిండియా ఫీల్డర్లు నాలుగు క్యాచ్‌లు వదిలేయడం

భారత బౌలర్లలో శివమ్ దూబే(2/33) రెండు వికెట్లు తీయగా.. హార్దిక్ పాండ్యా, కుల్దీప్ యాదవ్ చెరొక వికెట్ పడగొట్టారు. టీమిండియా ఫీల్డర్లు నాలుగు క్యాచ్‌లు వదిలేయడం పాకిస్థాన్‌కు కలిసొచ్చింది. లేకుంటే ఆ జట్టు తక్కువ స్కోర్‌కే పరిమితమయ్యేది.అనంతరం భారత్ 18.5 ఓవర్లలో 174 పరుగులు చేసి 7 బంతులు మిగిలి ఉండగానే గెలుపొందింది.

అభిషేక్ శర్మ(39 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్స్‌లతో 74) హాఫ్ సెంచరీకి తోడుగా..శుభ్‌మన్ గిల్(28 బంతుల్లో 8 ఫోర్లతో 47), తిలక్ వర్మ(19 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 30 నాటౌట్) మెరుపులు మెరిపించారు. పాకిస్థాన్ బౌలర్లలో హారిస్ రౌఫ్(2/26) రెండు వికెట్లు తీయగా.. అబ్రర్ అహ్మద్, ఫహీమ్ అష్రఫ్ తలో వికెట్ తీసారు. ఈ మ్యాచ్‌లో కూడా పాకిస్థాన్ ఆటగాళ్లకు భారత్ ప్లేయర్లు షేక్ హ్యాండ్ ఇవ్వలేదు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/ind-vs-pak-india-wins-over-pakistan/international/551650/

Anusha

రచయిత గురించి

Anusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.