హైదరాబాద్ మధురానగర్లో హృదయవిదారక సంఘటన ఒకటి చోటుచేసుకుంది.ప్రేమతో పెంచుకుంటున్న కుక్క చేతిలోనే యజమాని ప్రాణాలు కోల్పోయాడని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.ఈ ఘటన ప్రాంతంలో కలకలం రేపుతోంది.పోలీసుల ప్రాథమిక సమాచారం ప్రకారం, మృతుడు పవన్ కుమార్ అనే వ్యక్తి.అతను ప్రైవేట్ కంపెనీలో పని చేస్తున్న ఉద్యోగి. కొన్ని రోజులుగా అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నట్లు తెలుస్తోంది. శనివారం ఉదయం పవన్ స్నేహితుడు సందీప్ అతన్ని కలవడానికి ఇంటికి వెళ్లాడు. తలుపులు మూసి ఉండటం, ఎంత పిలిచినా స్పందన రాకపోవడం అనుమానాలకు దారితీసింది.అనుమానం వచ్చిన సందీప్ చివరికి తలుపు బలవంతంగా తీసి లోపలికి వెళ్లాడు.ఇంట్లో దృశ్యం చూస్తే ఎవరికైనా షాక్ తప్పదు.
పవన్ కుమార్ మృతి చెందిన స్థితిలో, రక్తపు మడుగులో పడివున్నాడు.అంతకన్నా భయంకరమైన విషయం ఏంటంటే, అతడి పెంపుడు కుక్క నోటికి రక్తం అంటుకుని ఉండటం.పవన్ శరీరంపై తీవ్ర గాయాలు ఉండటంతో, కుక్కే దాడి చేసి చంపినట్లుగా సందీప్ అనుమానించాడు. కొన్ని శరీర భాగాలు పూర్తిగా కనిపించకపోవడంతో, వాటిని కుక్క తినివేసినట్లు సమాచారం. వెంటనే మధురానగర్ పోలీసులకు ఫిర్యాదు చేసిన సందీప్, మొత్తం పరిస్థితిని వివరించాడు.ఫిర్యాదు తీసుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పరిశీలించి, పంచనామా చేసి, పోస్టుమార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు.
పోలీసులు ఈ మృతిని అనుమానాస్పదంగా పరిగణించి కేసు నమోదు చేశారు.పవన్ ఇంట్లో అప్పటికి అతని పెంపుడు కుక్క తప్ప మరెవ్వరూ లేరు. ఇందునే దృష్టిలో ఉంచుకుని పోలీసులు విచారణ చేస్తున్నారు. పోస్టుమార్టం రిపోర్టు వచ్చిన తరువాతే అసలు మృతికి గల కారణం స్పష్టమవుతుంది.ఇప్పటివరకు లభించిన ఆధారాల ప్రకారం, గాయాల తాలుకూ విశ్లేషణ జరుగుతోంది. ఇదంతా నిజమైతే, ఇది మానవుల మీద పెంపుడు జంతువుల దాడికి సంబంధించి అనుకోని మలుపు అవుతుంది. ఇటువంటి సంఘటనలు భవిష్యత్లో మరోసారి జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం స్పష్టమవుతోంది.పవన్ మృతిపై పోలీసులు లోతుగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇంటి సీసీ కెమెరా ఫుటేజ్, కుక్క వైఖరి, మృతుని ఆరోగ్యపరమైన అంశాలపై దృష్టిపెడుతున్నారు. ఈ కేసు పూర్తి వివరాలు త్వరలోనే వెలుగులోకి రానున్నాయి.
Read Also : Rains : ఆరెంజ్ అలర్ట్.. నాలుగు రోజులు జాగ్రత్త